శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరో ఇద్దరు పౌరులపై కాల్పులు జరిపి హత్య చేశారు. శ్రీనగర్, పుల్వామాలో శనివారం ఈ ఘటనలు జరిగాయి. శ్రీనగర్ ఈద్గా ప్రాంతంలో పానీపూరీలు అమ్ముకునే బీహార్కు చెందిన చిరు వ్యాపారి అరవింద్ కుమార్ షాపై సాయంత్రం 6.40 గంటలకు ఉగ్రవాదులు దగ్గరగా తుపాకీతో కాల్పులు జరిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు. దీంతో శ్రీనగర్లో గత రెండు వారాల్లో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన పౌరుల సంఖ్య 8కి చేరింది. మరోవైపు ఉత్తర ప్రదేశ్కు చెందిన వలస కూలీ సాగిర్ అహ్మద్పై ఉగ్రవాదులు కాల్పులు జరుపగా అతడు చనిపోయాడు. దీంతో ఈ రెండు ప్రాంతాల్లో అదనపు భద్రతా దళాలను రప్పించి ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
జమ్ముకశ్మీర్లోని ఉగ్రవాదులు ఇటీవల పౌరుల లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. కశ్మీర్ పండిట్లతోపాటు అక్కడి మైనార్టీలైన సిక్కు, స్థానికేతరులపై కాల్పులు జరిపి హత్య చేస్తున్నారు. గత వారం శ్రీనగర్లో ఒక స్కూల్ ప్రిన్సిపల్, ఇద్దరు టీచర్లు, బీహార్కు చెందిన ఒక వీధి వ్యాపారితోపాటు ఫార్మసిస్ట్ అయిన కశ్మీర్ పండిత్, మరో వ్యక్తిని ఉగ్రవాదులు కాల్చి చంపారు.
పౌరులపై జరుగుతున్న వరుస దాడుల నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వంపై అసహనం వ్యక్తమవుతున్నది. దీంతో ప్రత్యేక ఉగ్రవాద నిరోధక బృందాలను శ్రీనగర్కు కేంద్రం తరలించింది. మరోవైపు ప్రధాని మంత్రి ప్రత్యేక ఉపాధి పథకం కింద ప్రభుత్వ ఉద్యోగం పొంది కశ్మీర్కు తిరిగి వచ్చిన పలు వలస కుటుంబాలు మరోసారి ప్రాణ భయంతో తమ ఇండ్లను ఖాళీ చేస్తున్నారు.