న్యూఢిల్లీ, జూలై 6: రాష్ట్రపతి కోటాలో నలుగురు దక్షిణాది ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేస్తూ కేంద్రప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకున్నది. జాబితాలో ఎస్ఎస్ రాజమౌళి తండ్రి, సినీ కథా రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, పరుగుల రాణి పీటీ ఉషా, సామాజిక సేవకుడు వీరేంద్ర హెగ్డే ఉన్నారు. ఈ సందర్భంగా వాళ్లు అందించిన సేవలను ప్రధాని మోదీ గుర్తుచేసుకుంటూ ట్వీట్లు చేశారు. విజయేంద్రప్రసాద్ సేవలు మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేశాయని కొనియాడారు. అనేక తరాలకు ఇళయరాజా సంగీతం వారధిగా నిలిచిందన్నారు. క్రీడా రంగంలో పీటీ ఉషా జీవితం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. ఆరోగ్యం, విద్య, సాంస్కృతిక రంగాల్లో హెగ్డే గొప్ప కృషి చేశారని కొనియాడారు.
కేవీ విజయేంద్రప్రసాద్: ఆంధ్రప్రదేశ్లో మద్రాస్ ప్రెసిడెన్సీలోని కొవ్వూర్లో జన్మించారు. ప్రఖ్యాత దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి. తెలుగు, భారతీయ సినిమా స్థాయిని విశ్వవ్యాపితం చేసిన బాహుబలి సిరీస్తో పాటు భజరంగీబాయ్జాన్ తదితర చిత్రాలకు రచనా సహకారం అందించారు. పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు.
ఇళయరాజా: తమిళనాడులో మధురై జిల్లాలోని పన్నాయిపురంలో దళిత కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటినుంచే అవమానాలు ఎదుర్కొన్నారు. అన్ని ంటికీ ఎదురొడ్డి గొప్ప సంగీత దర్శకుడిగా నిలిచారు. వెయ్యికి పైగా చిత్రాలకు సంగీతమందించారు.
పీటీ ఉషా: కేరళలోని కోజికోడ్ జిల్లాలోని కుత్తాలి గ్రామంలో జన్మించారు. ఆసియా క్రీడలు, ఆసియా ఛాంపియన్షిప్స్, వరల్డ్ జూనియర్ ఇన్విటేషనల్ మీట్, పలు ఇంటర్నేషనల్ స్పోర్టింగ్ ఈవెంట్లలో లెక్కకు మించిన మెడల్స్ గెలుచుకున్నారు. కెరీర్లో జాతీయ, ఆసియా స్థాయిలో పలు రికార్డులను బద్దలుకొట్టారు. పరుగుల రాణి, పయ్యోలి ఎక్స్ప్రెస్గా గుర్తింపు పొందారు.
వీరేంద్ర హెగ్డే: కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని బంత్వాల్లో జన్మించారు. ప్రఖ్యాత ధర్మస్థల ఆలయం హెడ్. గ్రామీణాభివృద్ధి, స్వయం ఉపాధి మార్గాలపై యువత ప్రేరణ పొందేలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. గొప్ప సమాజ సేవకుడు.