నోయిడా : ఉత్తర్ ప్రదేశ్లోని గౌతమ్ బుద్ధానగర్లో అధికారులు సెక్షన్ 144ను అమలులోకి తీసుకువచ్చారు. రంజాన్, రామ నవమి, అంబేద్కర్ జయంతి, హైస్కూల్ (10వ తరగతి), ఇంటర్ పరీక్షలు (12వ తరగతి) దృష్ట్యా జిల్లాలో శుక్రవారం నుంచి నెలాఖరు వరకు గౌతమ్ బుద్ధనగర్ పరిపాలన సెక్షన్ 144 విధించింది. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. శాంతి భద్రతల పరిరక్షణ అత్యంత కీలకమని, పండుగల దృష్ట్యా జిల్లా పరిధిలో 144 సెక్షన్ విధించాలని నిర్ణయం కమిషనర్ తీసుకున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 2 నుంచి చైత్ర నవరాత్రులు, రంజాన్ నెల ప్రారంభం కానున్నది. 10న రామ నవమి జరుగనున్నది. 14న అంబేద్కర్ జయంతి, 15న గుడ్ ఫ్రైడే, 16న హన్మాన్ జయంతి, 17న ఈస్టర్ తదితర పండుగలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా అధికారులు సెక్షన్ 144ను అమలులోకి తీసుకువచ్చారు.