లక్నో: ఉత్తర ప్రదేశ్ నోయిడాలో జంట టవర్ల కూల్చివేత ముందు ఒక వ్యక్తి తన ఫ్లాట్లో గాఢంగా నిద్రపోయాడు. అయితే కూల్చివేత బృందం చివరిసారి తనిఖీ చేయడంతో అతడ్ని గుర్తించారు. సూపర్టెక్ సంస్థ అక్రమంగా నిర్మించిన 40 అంతస్తుల జంట టవర్లను సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆదివారం కూల్చివేశారు. దీని కోసం ఒక ప్రత్యేక బృందం నెల రోజులుగా శ్రమించింది. జంట టవర్ల సమీపంలోని వారిని ఖాళీ చేయించడంతోపాటు బాంబులు అమర్చి సురక్షితంగా పేల్చి భారీ నిర్మాణాన్ని నేలమట్టం చేయడంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
కాగా, ఆ సొసైటీలో 15 నివాసిత టవర్లు ఉన్నాయి. ప్రతి టవర్లో 44 అపార్ట్మెంటులున్నాయి. సుమారు 2,500 మంది నివాసితులు ఆ అపార్ట్మెంట్లలో ఉంటున్నారు. వాటిలోని నివాసితులను శుక్రవారమే ఖాళీ చేయించారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారు అక్కడి నుంచి ముందుగానే వెళ్లిపోయారు. అయితే సమీపంలో షెల్టర్ కల్పించిన వారు మాత్రం ఆదివారం ఉదయం వరకు తమ ఫ్లాట్లలోనే ఉన్నారు. ఉదయం ఏడు గంటలకు వారు అక్కడి నుంచి షెల్టర్ కేంద్రాలకు వెళ్లారు.
కాగా, ఒక వ్యక్తి మాత్రం తన అపార్ట్మెంట్ ఫ్లాట్లో గాఢ నిద్రలో మునిగిపోయాడు. ఖాళీ చేయాల్సిన నిర్ణీత సమయానికి అతడు మేల్కోలేదు. అయితే జంట టవర్ల కూల్చివేత ముందు చివరిసారి అన్నిచోట్ల తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఒక టవర్లోని పై అంతస్తు ఫ్లాట్లో నిద్రపోతున్న ఆ వ్యక్తిని సెక్యూరిటీ గార్డు గుర్తించాడు. ఈ విషయాన్ని ప్రత్యేక బృందానికి చెప్పి అలెర్ట్ చేశాడు. దీంతో అతడ్ని నిద్ర లేపి అక్కడి నుంచి షెల్టర్కు పంపారు. అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సకాలంలో ఆ వ్యక్తిని గుర్తించినట్లు ప్రత్యేక బృందంలోని ఒక సభ్యుడు తెలిపారు.