లక్నో: ప్రధాని మోదీ ప్రభుత్వంలో ఆయన ధనిక స్నేహితులకు తప్ప, ఎవరికీ భద్రత లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. దేశంలోని పేదలు, దళితులు, మహిళలకు భద్రత లేకపోయినా ఆయన బిలియనర్ స్నేహితులు మాత్రం బాగా ఉన్నారని ఆమె విమర్శించారు. ప్రధాని మోదీ నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఆదివారం ‘రైతులకు న్యాయం’ పేరుతో భారీ బహిరంగ సభను ప్రియాంక నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రంతోపాటు ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు.
ప్రియాంక గాంధీ తన ప్రసంగాన్ని శ్లోకాలతో ప్రారంభించారు. ‘ఈ రోజు నవరాత్రులలో నాల్గవ రోజు. నేను ఈ రోజు ఉపవాసం పాటిస్తున్నాను. నేను మాత స్తుతితో మొదలుపెట్టాలనుకుంటున్నాను. ఇది నవరాత్రుల సమయం కాబట్టి, నా హృదయంతో మాట్లాడాలని అనుకున్నాను’ అని ప్రసంగాన్ని ప్రారంభించారు. లఖింపూర్ ఖేరీ ఘటనలో నిందితుడైన మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాను కాపాడేందుకు సీఎం యోగి ఎందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. తమను జైల్లో పెట్టి కొట్టినా సరే న్యాయం కోసం పోరాడతామని తెలిపారు. లక్నోను సందర్శించిన ప్రధాని మోదీ లఖింపూర్ ఖేరీలో బాధిత రైతులను ఎందుకు పరామర్శించలేదని ఆమె ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను ఆ పదవి నుంచి తొలగించే వరకు తన పోరాటం కొనసాగుతుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదిగా నిరసన చేస్తున్నా వారితో మాట్లాడేందుకు మోదీకి సమయం లేదని ప్రియాంక గాంధీ విమర్శించారు. దేశంలో ఒక వైపు ద్రవ్యోల్బణం, మరోవైపు నిరుద్యోగ సమస్య పెరుగుతున్నదని ఆరోపించారు. ఈ సమస్యల కారణంగా ప్రజలు ప్రభుత్వంపై కోపంతో ఉన్నారని, కలత చెందుతున్నారని అన్నారు. ప్రజలు తమ ఉద్యోగాలు కోల్పోతున్నప్పటికీ, చిన్న వ్యాపారాలు మూతపడుతున్నప్పటికీ ప్రధాని మోదీ ధనిక స్నేహితులు బిలియన్ల కొద్దీ డబ్బు సంపాదిస్తున్నారని ఆమె మండిపడ్డారు.
ప్రధాని మోదీ తన కోసం రూ.16,000 కోట్లతో రెండు విమానాలు కొనుగోలు చేశారని, ఆపై ఎయిర్ ఇండియాను రూ.18,000 కోట్లకు విక్రయించారని ప్రియాంక గాంధీ విమర్శించారు. ‘ఈ దేశం ప్రధాని మోదీ, ఆయన మంత్రుల ఆస్తి కాదు. ఈ దేశం మీది. ఇది మీకు తెలియకపోతే, మీరు మీ సొంత దేశాన్ని, మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు. ఈ దేశాన్ని మీరే నిర్మించారు’ అని వ్యాఖ్యానించారు. ‘మీరు మార్పు కోరుకుంటే, నాతో రండి. కలిసి పోరాడి ఈ ప్రభుత్వాన్ని మార్చండి. ఇక్కడ మార్పు తీసుకువచ్చే వరకు నా పోరాటాన్ని ఆపను’ అని అన్నారు.