Poll Boycott | ‘తమ కోరిక తీరలేదు.. అందుకే ఎన్నికలను బషిహ్కరిస్తున్నాం..’ అని గుజరాత్లోని 18 గ్రామాల ప్రజలు పిలుపునిచ్చారు. ఈ గ్రామాలన్నీ నవ్సారి నియోజకవర్గం పరిధిలోనివి కావడం విశేషం. అన్ని గ్రామాలలో పోల్ బాయ్కాట్ బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. ఇక్కడి ప్రజల డిమాండ్ కారణంగా ఈ గ్రామాల్లో ప్రచారం చేపట్టేందుకు అధికార బీజేపీ నాయకులు జంకుతున్నారు. ఈ 18 గ్రామాల ప్రజల నిర్ణయంతో బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ ఈ గ్రామాల ప్రజల డిమాండ్ ఏంటంటే అంచెలి రైల్వే స్టేషన్లో లోకల్ రైళ్లను ఆపడమే. చాలా కాలంగా కోరుతున్నా పట్టించుకోకపోవడంతో ఈసారి గట్టి నిర్ణయం తీసుకుని అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తున్నారు.
అంచెలి రైల్వేస్టేషన్ సమీపంలో ‘ట్రెయిన్ నహీ తో వోట్ నహీ’ అంటూ బ్యానర్లు వెలిశాయి. ఎన్నికల ప్రచారానికి బీజేపీ, ఇతర రాజకీయ పార్టీలు రావొద్దు.. మా డిమాండ్లు నెరవేరడం లేదు.. ఎన్నికలను బహిష్కరిస్తున్నాం.. అని బ్యానర్లపై స్పష్టంగా రాశారు. అంచెలి రైల్వేస్టేషన్లో లోకల్ రైళ్లను ఆపకపోవడంతో 18 గ్రామాల ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కార్యాలయాలు, కాలేజీలు, స్కూళ్లకు వెళ్లాలంటే నడిచి వెళ్లాల్సి వస్తుందని, రైళ్లను ఇక్కడ ఆపాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని కాలేజీ విద్యార్థి ప్రాచీ పటేల్ విచారం వ్యక్తం చేశారు.
గతంలో ఇక్కడ రైళ్లు అగేవని, కరోనా వ్యాప్తి సమయం నుంచి రైళ్లను నిలుపడం లేదని ఇక్కడి వారు చెప్తున్నారు. అందుకే ఎన్నికలను బహిష్కరించి ఖాళీ ఈవీఎంలను తిప్పిపంపి బీజేపీ ప్రభుత్వానికి, రైల్వే అధికారులకు సమస్య తెలిసేలా చేస్తున్నట్లు జెడ్ఆర్సీసీ సభ్యుడు చోటుభాయ్ పాటిల్ వివరించారు. ఎన్నికలు బహిష్కరించిన ఈ 18 గ్రామాలు బీజేపీకి కంచుకోట అయిన నవ్సారి నియోజకవర్గం పరిధిలోనివి. గత 27 ఏండ్లుగా గుజరాత్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ఆప్, కాంగ్రెస్ పార్టీలు కృతనిశ్చయంతో ఉన్నాయి.