DK Shivakumar : కర్ణాటక (Karnataka) లో సీఎం మార్పు వివాదం ముదరడంతో ఇటీవల కాంగ్రెస్ అధిష్ఠానం జోక్యం చేసుకుని సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah), డిప్యూటీ సీఎం డికే శివకుమార్ (Deputy CM DK Shivakumar) మధ్య బ్రేక్ఫాస్ట్ మీట్ (Breakfast meet) ఏర్పాటు చేసింది. ఆ మీటింగ్ ఎందుకు జరుపుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని డీకే శివకుమార్ తాజాగా వెల్లడించారు.
మీడియా ఒత్తిడి కారణంగానే తాము కలిసి బ్రేక్ఫాస్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మీరు సిద్ధరామయ్యను ఎప్పుడు బ్రేక్ఫాస్ట్కు ఆహ్వానిస్తున్నారు? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అది తమ ఇద్దరికి సంబంధించిన విషయమని చెప్పారు. కాగా అధిష్ఠానం సూచనల మేరకు సిద్ధరామయ్య మూడు రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రిని బ్రేక్ఫాస్ట్ చర్చకు ఆహ్వానించారు.
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు విషయంలో గత కొన్ని రోజుల నుంచి విస్తృతంగా చర్చ జరుగుతోంది. సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్కు అవకాశం ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి వర్గం కోరుతున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. కర్ణాటక కాంగ్రెస్, ప్రభుత్వంలో రెండు వర్గాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ తాజాగా స్పందించారు.
సిద్ధరామయ్య, తాను సోదరుల్లా కలిసి ముందుకు సాగుతున్నామని డీకే అన్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో లేదా ప్రభుత్వంలో సిద్ధరామయ్య గ్రూప్ లేదా డీకే శివకుమార్ గ్రూప్ అంటూ ఏమీ లేవని స్పష్టంచేశారు. మీడియా మాత్రం కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో గ్రూప్లు ఉన్నట్లు ప్రచారం చేస్తోందని విమర్శించారు. మీడియా ఒత్తిడివల్లే తాము ఇటీవల బ్రేక్ఫాస్ట్ చర్చలు జరిపామని తెలిపారు.