స్మార్ట్ఫోన్ ప్రభావం పెరిగిపోవడంతో.. సోషల్ మీడియాలో వచ్చిందే నిజమైన వార్త అనే దుస్థితికి చేరుకున్నాం. అయితే, దీనితో లాభాలెన్నో, నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. కొన్ని వార్తలు నిజమా? కాదా? అని చెక్ చేసుకోకముందే మనం వాటిని షేర్ చేస్తుంటాం. ఈ మధ్య కాలంలో ఇటువంటి ఫేక్ వార్తలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం తందూరి రోటి బ్యాన్ చేసిందంటూ ఓ వార్త ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ”మధ్యప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం చేదువార్త. ఇకనుంచి భోపాల్, గ్వాలియర్, ఇండోర్, జబల్పూర్, ఉజ్జయిని, కాండ్వా, ప్రాంతాల్లో తందూరి రోటి అందుబాటులో ఉండదు. పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తందూరిని నిషేధించింది. ఒకవేళ ఎవరైనా ప్రభుత్వ ఆంక్షలను ఉల్లంఘిస్తే రూ. 5 లక్షల జరిమానా.” అని ఈ వార్త ఉండగా.. ఈ నెల 9న సామాజిక మాధ్యమాలలో ఈ న్యూస్ తెగ వైరల్ అయ్యింది.
అయితే ఈ వార్త అటు ఇటు పాకుతూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం వరకు వెళ్లింది. కాగా దీనిపై సీరియస్ అయిన సర్కార్ వెంటనే వివరణ ఇచ్చింది.
రాష్ట్రంలో తందూరి వాడినా, తందూరి వడ్డించినా ప్రభుత్వం జరిమాన విధిస్తుందని వచ్చిన వార్తలు అబద్దమని.. ఎంపీలో తందూరిని నిషేధిస్తూ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని మధ్యప్రదేశ్ ప్రభుత్వం అదివారం స్పష్టం చేసింది. ఇటువంటి అసత్యపు ప్రచారాలు మానుకోవాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.