న్యూఢిల్లీ, జనవరి 28: దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ అధ్యాపకుల పోస్టులు ఇప్పటికే చాలా ఖాళీగా ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్న వేళ.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వివాదాస్పద ప్రతిపాదన తీసుకొచ్చింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వ్డ్ అధ్యాపకుల పోస్టుల ఖాళీల భర్తీకి అర్హత కలిగిన వ్యక్తులు లేని పక్షంలో ఆ పోస్టులను డీ రిజర్వ్ చేసి ఓపెన్ పోస్టులుగా మార్చాలని ప్రతిపాదించింది.
ఈ మేరకు ముసాయిదా ప్రతిపాదనలతో కూడిన ఓ డాక్యుమెంట్ను ప్రజల అభిప్రాయాల కోసం విడుదల చేసింది. యూనివర్సిటీలు, ఐఐటీ వంటి ఉన్నత విద్యా సంస్థల్లో రిజర్వేషన్ పోస్టులకు సరైన అభ్యర్థులు లభించటంలేదని సాకు చూపిస్తూ ఉద్దేశపూర్వకంగానే ఆ పోస్టులను ఏండ్ల తరబడి ఖాళీగా ఉంచుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ సమయంలో యూజీసీ ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
గ్రూప్ బీ, సీ, డీ పోస్టులు కూడా..
అత్యవసర సందర్భాల్లో రిజర్వేషన్ పోస్టుకు సరైన అభ్యర్థులు లభించనప్పుడు గ్రూప్ ఏ పోస్టులను అన్రిజర్వ్డ్గా మార్చే విధానం ప్రస్తుతం ఉన్నది. తాజాగా గ్రూప్ బీ, సీ, డీ పోస్టులను కూడా జాబితాలోకి తీసుకురావాలని యూజీసీ ప్రతిపాదించింది. గ్రూప్ ఏ, బీ పోస్టులను డీ రిజర్వేషన్లోకి మార్చాలంటే కేంద్ర విద్యాశాఖ అనుమతి తీసుకోవాలని, గ్రూప్ సీ, డీ పోస్టులకయితే యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదిస్తే సరిపోతుందని డ్రాఫ్ట్లో పేర్కొన్నారు. యూజీసీ ప్రతిపాదన అత్యంత ప్రమాదకరమని విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి.
ఈ విధానం అమల్లోకి వస్తే ఉద్దేశపూర్వకంగానే రిజర్వేషన్ అభ్యర్థులు లేరని చెప్పి ఆ పోస్టులను ఓపెన్గా మారుస్తారని ఆందోళన వ్యక్తంచేశాయి. యూజీసీ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు జేఎన్యూ స్టూడెంట్ యూనియన్ ప్రకటించింది. ఉన్నత విద్యా సంస్థల పోస్టుల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఉన్న రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తివేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ చేస్తున్న కుట్రలో భాగంగానే యూజీసీ ఈ ప్రతిపాదన చేసిందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శించారు.
పోస్టులు డీ రిజర్వ్ చేయడం ఉండదు: కేంద్రం
యూజీసీ ప్రతిపాదనలపై తీవ్ర విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో కేంద్ర విద్యా శాఖ ఆదివారం స్పందించింది. రిజర్వేషన్ పోస్టులను డీ రిజర్వ్ చేయడం ఉండదని స్పష్టం చేసింది. 2019లో చేసిన చట్టం ప్రకారం కేంద్ర విద్యా సంస్థల్లో టీచర్ క్యాడర్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో అన్ని పోస్టులకు రిజర్వేషన్ ఉంటుందని పేర్కొన్నది.
సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్(రిజర్వేషన్ ఇన్ టీచర్స్ క్యాడర్) చట్టం-2019 అమల్లోకి తర్వాత ఏ రిజర్వేషన్ పోస్టును డీ రిజర్వ్ చేయకూడదని, ఈ మేరకు చట్టప్రకారం ఖాళీల భర్తీ చేపట్టాలని ఆదేశాలు జారీచేశామని ఎక్స్ పోస్టులో తెలిపింది. మరోవైపు కేంద్ర విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల పోస్టులను డీ రిజర్వ్ చేయబోమని యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ స్పష్టత ఇచ్చారు. రిజర్వ్ క్యాటగిరీలోని బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేసేందుకు ఉన్నత విద్యా సంస్థలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు.