హైదరాబాద్ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణించింది. వైరస్కు వ్యతిరేకంగా ప్రస్తుతం టీకాలు అందుబాటులోకి రాగా.. భారత్లో వ్యాక్సినేషన్ సాగుతున్నది. పలు దేశాలు ఇప్పటికే తమ పౌరులకు బూస్టర్ డోసులు వేస్తున్నాయి. భారత్లోనూ బూస్టర్ డోస్పై చర్చ సాగుతున్నది. ఈ క్రమంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కీలక ప్రకటన చేసింది.
బూస్టర్ డోస్ పని తీరుపై ఇప్పటి వరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు గుర్తించలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రెండు డోసుల వ్యాక్సిన్ అందించడమే ప్రాధాన్యమైన అంశమని పేర్కొన్నది. ఇదే విషయమైన కేంద్ర వైద్యారోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ సైతం స్పష్టతనిచ్చారు. దేశంలో వ్యాక్సిన్ నిల్వలు సరిపోయేంతగా ఉన్నాయని, అయితే లక్షిత ప్రజలకు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేయడమే లక్ష్యమని చెప్పారు.
బూస్టర్ డోస్పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఐసీఎంఆర్, నిపుణుల కమిటీ బూస్టర్ డోస్ అందించాలని సూచిస్తే తాము పరిశీలిస్తామన్నారు. పలు దేశాల్లో ఇప్పటికీ మొదటి డోసు సైతం అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సైతం బూస్టర్ డోస్పై తొందరపడొద్దని అగ్రదేశాలకు సూచించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోని పేద దేశాలకు టీకాలు అందించేందుకు ధనిక దేశాలను కోరుతున్నది.