Union Budget 2022 : దేశ వ్యాప్తంగా 100 నగరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 2015 లో స్మార్ట్ సిటీస్ మిషన్ అన్న పథకాన్ని ప్రారంభించింది. అయితే ఈ తాజా బడ్జెట్లో మాత్రం స్మార్ట్ సిటీస్ అన్న అంశాన్నే కేంద్ర ప్రభుత్వం చేర్చలేదు. 2022-2023 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ఎక్కడా స్మార్ట్ సిటీస్ ఊసే ఎత్తలేదు. నిజానికి ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ పథకం అన్నది 2023 వరకూ అమలులో ఉంటుంది. అయినా సరే.. ఈ బడ్జెట్లో కేంద్రం ఈ విషయాన్ని ప్రస్తావించనే లేదు. అంటే ఈ స్మార్ట్ సిటీస్ అన్న పథకానికి కేంద్ర ప్రభుత్వం తిలోదకాలిచ్చినట్లేనా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. స్మార్ట్ సిటీల కోసం కేంద్ర ప్రభుత్వం గత యేడాది ఆర్థిక బడ్జెట్లో 6,450 కోట్లను కేటాయించారు. ఈ బడ్జెట్లో మాత్రం ఏకంగా ఈ అంశాన్నే కేంద్రం చేర్చలేదు. తొలి దశలో 20 నగరాలను ఎంపిక చేసింది. రెండో దశలో 27 నగరాలు, మూడో దశలో 30 నగరాల జాబితాను విడుదల చేశారు. అంతేకాకుండా ఇలా ఎంపికైన నగరాలకు అవార్డులను కూడా ప్రకటించారు. ఇందులో సామాజిక అంశాలు, పరిపాలన, సంస్కృతి, పట్టణాభివృద్ధి, పారిశుద్ధ్యం, ఆర్థిక వ్యవస్థ, తాగునీరు, తదితర అంశాల ప్రాతిపదికగా ఈ అవార్డులను ప్రకటిస్తున్నారు. ఇంత చేసిన సర్కార్.. ఈ బడ్జెట్లో మాత్రం స్మార్ట్ సిటీస్ అన్న అంశాన్నే చేర్చలేదు.