LPG cylinder : చమురు సరఫరాపై దేశ ప్రజల్లో ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. దేశీయ అవసరాలకు తగ్గట్లుగా చమురును 40 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గతంలో 27 దేశాల నుంచే చమురును కొనుగోలు చేయగా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో 40 దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నట్లు కేంద్రం వెల్లడించింది.
ఈ అంశంపై ఇప్పటికే చమురు సరఫరా దేశాలతో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సంప్రదింపులు జరిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీలైనంత త్వరగా చమరు సరఫరా చేయాలని కోరినట్లు సమాచారం. కొన్ని దేశాలు ఇప్పటికే సరఫరా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. దేశంలో ఎల్పీజీ ఉత్పత్తి కూడా 10 శాతం పెరిగిందని కూడా కేంద్ర వర్గాలు అంటున్నాయి. కేంద్ర ప్రకటనలు సానుకూలంగానే ఉన్నా.. దేశ ప్రజల్లో మాత్రం ఇంకా చమురు సరఫరా విషయంలో అనుమానాలు తగ్గడం లేదు. ఎందుకంటే ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సరఫరా విషయంలో పలు ఆంక్షలు అమలవుతున్నాయి. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో కమర్షియల్ గ్యాస్ లభ్యత తగ్గిపోవడతో రెస్టారెంట్లు ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అవసరమైతే రెస్టారెంట్లను మూయక తప్పదని రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ అసోసియేషన్లు అంటున్నాయి.
తగినంతగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరా లేకపోతే రెస్టారెంట్లకు సంబంధించి రోజుకు రూ.1,200 కోట్ల నుంచి రూ.1,300 కోట్ల వరకు నష్టం జరిగే అవకాశం ఉందని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) వైస్ ప్రెసిడెంట్ జోరావర్ కర్లా అన్నారు. ప్రస్తుతం రెస్టారెంట్లకు తగినంతగా ఎల్పీజీ సిలిండర్ల సరఫరా లేదని, 75 శాతం వరకు రెస్టారెంట్లు వీటిపైనే ఆధారపడ్డాయని ఆయన అన్నారు. మరోవైపు ఎల్పీజీ సిలిండర్ల కొరత నేపథ్యంలో ఢిల్లీలో పలు రెస్టారెంట్లు మెనూలో మార్పులు చేశాయి. గ్యాస్ ఎక్కువగా అవసరమైన ఆహార పదార్థాల్ని జాబితా నుంచి తొలగిస్తున్నాయి. ఎల్పీజీ సిలిండర్లపైన కాకుండా.. ఎలక్ట్రిక్ కుక్కర్లపై వంటలు చేయడం ప్రారంభించాయి.