న్యూఢిల్లీ, జనవరి 31: పెగాసస్ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున.. దీనిపై ప్రత్యేక చర్చ అవసరం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లద్ జోషి పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తీర్మానంపై మాట్లాడే సమయంలోప్రతిపక్షాలు ఏ అంశాన్ని అయినా లేవనెత్తవచ్చని అన్నారు. సోమవారం ఆయన వర్చువల్గా అఖిలపక్ష సమావేశం సమావేశం నిర్వహించారు. ఇందులో 25 పార్టీల ఫ్లోర్లీడర్లు పాల్గొన్నారు. కేంద్రం తరపున రక్షణశాఖ మంత్రి, లోక్సభ ఉపనేత రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. సమావేశం అనంతరం జోషి మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరినట్టు తెలిపారు. అఖిలపక్ష సమావేశంలో అరోగ్యకరమైన చర్చ జరిగిందని, అన్ని పార్టీల నేతల అభిప్రాయాలు పంచుకున్నట్టు పార్లమెంటరీ శాఖ ఓ ప్రకటనలో పేర్కొన్నది.
నిజాలు దాచేందుకు సర్కార్ యత్నం
మరోవైపు పెగాసస్పై పార్లమెంట్ను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్పై ప్రివిలేజ్ మోషన్ తీసుకురావాలని సీపీఐ రాజ్యసభ ఎంపీ బినోయ్ విశ్వం రాజ్యసభలో నోటీసు సమర్పించారు. నిజాలను దాచేందుకు ప్రభుత్వం పలుమార్లు ప్రయత్నించిందని, స్పైవేర్ను కేంద్రం కొనుగోలు చేసిందనే దానికి అనేక ఆధారాలు బయటకు వచ్చాయని పేర్కొన్న ఆయన తాజా న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రస్తావించారు.