రాయ్పూర్: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సభ్యులను నేరుగా ఎంపిక చేయనున్నారు. ఈసారికి ఎన్నికల ద్వారా సభ్యుల ఎంపిక జరుపరాదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సీడబ్ల్యూసీ సభ్యులను నామినేట్ చేసే బాధ్యతను ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు అప్పగించింది. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటీ ఏకగీవ్ర నిర్ణయం తీసుకుంది. సీడబ్ల్యూసీ సభ్యులందరినీ నామినేట్ చేసే అధికారాన్ని పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు కట్టబెట్టింది. ఈ సమావేశంలో పాల్గొన్న 45 మంది సీడబ్ల్యూసీ సభ్యులు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్, జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ తెలిపారు.
కాగా, కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న అజయ్ మాకెన్, అభిషేక్ మను సింఘ్వీ, దిగ్విజయ్ సింగ్ వంటి నేతలు సీడబ్ల్యూసీ సభ్యుల ఎన్నికకు మొగ్గు చూపినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే కాంగ్రెస్లో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని కాంగ్రెస్ సీనియర్ నేత దినేష్ గుండూరావు తెలిపారు. పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు, పార్టీ ప్రయోజనం కోసం సీడబ్ల్యూసీ సభ్యుల ఎంపికను ఖర్గే నిర్ణయానికే వదిలేసినట్లు చెప్పారు.
మరోవైపు కాంగ్రెస్ ముఖ్య నేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కీలమైన ఈ స్టీరింగ్ కమిటీ సమావేశానికి దూరంగా ఉన్నారు. పార్టీ నిర్ణయాల్లో ఖర్గేకు మరింత స్వేచ్ఛ ఇచ్చేందుకే ఈ భేటీలో వారు పాల్గోలేదని కాంగ్రెస్ నేతలు తెలిపారు. అయితే రాయ్పూర్లో మూడు రోజులపాటు జరుగనున్న ప్లీనరీ మిగతా కార్యక్రమాలకు సోనియా, రాహుల్, ప్రియాంక హాజరవుతారని వెల్లడించారు.
కాగా, 2024 లోక్సభ ఎన్నికలకు రోడ్ మ్యాప్ను రూపొందించడంతోపాటు, బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలను ఖరారు చేయడం వంటి వాటిపై ఈ ప్లీనరీలో కీలక నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ తీసుకోనున్నది. అలాగే గ్రామ, మండల, వార్డు స్థాయిలలో పార్టీ యూనిట్ల ఏర్పాటు వంటి పలు మార్పులతో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి 30 సవరణలను కూడా చేయనున్నారు.