No Dowry | తండ్రి ఆస్తిలో కుమారులకు ఉన్న సమాన వాటా కుమార్తెలకు ఉంటుందని భారత రాజ్యాంగం పేర్కొంది. అయితే, ముస్లిం సమాజంలోనూ ఆడబిడ్డలకు కట్నం ఇవ్వకుండా.. ఆస్తిలో వాటా ఇవ్వాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు కాన్ఫరెన్స్లో ఉలామా విజ్ఞప్తి చేసింది. యూపీ లక్నోలోని ఐష్బాగ్లోని దారుల్ ఉలూమ్ ఫరంగి మహాలీ హాల్లో షరియత్ కాన్ఫరెన్స్ జరిగింది. ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు మౌలానా అతిక్ అహ్మద్ బస్తావీ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా మౌలానా నస్రుల్లా నద్వీ మాట్లాడుతూ ముస్లిం వ్యక్తిగత చట్టం ప్రకారం వారసత్వ సంపదలో ఆడబిడ్డలందరికీ కట్నం ఇవ్వకుండా ఆస్తిలో వాటా ఇవ్వాలని.. దాంతో ఆడపిల్లలు ఆర్థికంగా ఇబ్బందులుపడకుండా ఉంటారన్నారు. ఇస్లాంలో మహిళలకు ప్రాముఖ్యత, గౌరవం, హక్కులు కల్పించారన్నారు. పిల్లల పెంపకం, విద్య చాలా ముఖ్యమైందన్నారు.
అయితే గృహ నిర్వహణ బాధ్యత మహిళపైనే ఉందన్నది కూడా వాస్తవమని.. ఇస్లామిక్ షరియత్ ఈ విషయంలో పూర్తి మార్గదర్శకత్వం చేస్తుందని.. అందరూ సూచనలను పాటించడం ప్రారంభిస్తే మన ఇళ్లు స్వర్గంగా మారుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈద్గా ఇమామ్ మౌలానా ఖలీద్ రషీద్ ఫరంగి మహాలీ మాట్లాడుతూ దేశంలో అన్ని మతాలకు తమ వ్యక్తిగత చట్టాలను అసుసరించే రాజ్యాంగ స్వేచ్ఛ ఉందన్నారు. ముస్లిం పర్సనల్ లాపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడమే సదస్సు లక్ష్యమని అన్నారు.