న్యూఢిల్లీ: వాహన స్క్రాప్ పాలసీ కింద ఒక వాహనాన్ని తుక్కుగా మార్చడానికి ఎలాంటి కచ్చిత కాల పరిమితిని నిర్ధారించలేదని, కండీషన్లో ఉన్నంత వరకు వాటిని తిప్పుకోవచ్చునని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ బుధవారం స్పష్టం చేసింది.
పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న వ్యవసాయ ట్రాక్టర్లను తుక్కు కిందకు తరలించాల్సిందేనంటూ వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఆ శాఖ ఖండించింది. వాహనం ఫిట్గా ఉన్నంతకాలం వాటిని ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లలో తనిఖీ చేసి రెన్యువల్ చేసుకోవచ్చన్నారు. ఇదే విధానం అన్ని రవాణేతర వాహనాలకు వర్తిస్తుందన్నారు. వాహన స్క్రాప్ పాలసీ ప్రకారం ప్రభుత్వ, ప్రభుత్వ రంగానికి చెందిన వాహనాలను మాత్రమే నిర్దేశిత కాలం గడిచిన తర్వాత తుక్కుకు తరలించాలని, అది మిగిలిన వాహనాలకు వర్తించదన్నారు.