చెన్నై: చెన్నైకి చెందిన గ్లోబల్ ఫార్మా(Global Pharma) కంపెనీ తయారు చేస్తున్న ఐడ్రాప్స్ వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అవుతున్నట్లు అమెరికా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాల తమిళనాడు డ్రగ్ రెగులేటరీ సంస్థ ప్రకటన రిలీజ్ చేసింది. గ్లోబల్ ఫార్మా తయారు చేస్తున్న ఆర్టిఫిషియల్ టియర్స్(Artificial Tears) కంటి చుక్కల్లో ఎటువంటి కలుషిత పదార్ధాలు లేవని ఆ సంస్థ తెలిపింది. ఆ ఐడ్రాప్స్ వేసుకోవడం వల్ల కొందరిలో అంధత్వం వస్తుందని, కొందరు చనిపోయినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి.
చెన్నై ప్లాంట్లో తయారు చేసిన ఐడ్రాప్స్(Eye Drops) శ్యాంపిళ్లను పరీక్షించామని, వాటిల్లో ఎటువంటి కంటామినేషన్ లేదని తమిళనాడు డ్రగ్స్ కంట్రోల్ డైరక్టర్ పీవీ విజయలక్ష్మీ తెలిపారు. అనేక బ్యాచ్లకు చెందిన ఐడ్రాప్స్ శ్యాంపిళ్లను టెస్ట్ చేశామన్నారు. కంటి చుక్కల తయారీ కోసం వాడే ముడి సరుకులు కూడా నాణ్యత ప్రకారమే ఉన్నట్లు డ్రగ్ డైరెక్టర్ చెప్పారు. అమెరికాకు చెందిన సీడీసీ(CDC) చేసిన ఆరోపణలపై స్పందించేందుకు విజయలక్ష్మీ నిరాకరించారు.
అమెరికాకు ఎగుమతి చేసిన ఇజ్రికేర్ ఆర్టిఫిషియల్ టియర్స్ వల్ల ముగ్గురు మరణించారని, ఎనిమిది మంది చూపు కోల్పోయారని, పదుల సంఖ్యలో ఇన్ఫెక్షన్ కేసు(infection cases)లు నమోదయ్యాయని సీడీసీ భావిస్తున్నది. సూడోమోనాస్ ఎరుగినోసా అనే బ్యాక్టీరియా ఈ ఐడ్రాప్స్ ద్వారా సోకిందని, ఈ బ్యాక్టీరియా రక్తం, ఊపిరితిత్తులు, గాయాలలో ఇన్ఫెక్షన్కు కారణమవుతుందని అనుమానిస్తున్నది. ఈ ఐడ్రాప్స్ వాడి కంటి ఇన్ఫెక్షన్ వంటి లక్షణాలు ఉన్న వారు వెంటనే చికిత్స తీసుకోవాలని ప్రజలకు సీడీసీ సూచించింది.