Delhi blast : ఢిల్లీ (Delhi) లోని ఎర్రకోట (Red fort) సమీపంలో సోమవారం రాత్రి జరిగిన పేలుడుకు సంబంధించిన కేసులో అరెస్టైన నిందితులతో తమకు ఎలాంటి సంబంధం లేదని.. హర్యానా (Haryana) రాష్ట్రం ఫరీదాబాద్ (Faridabad) లోని అల్ ఫలా యూనివర్సిటీ (Al Falah university) స్పష్టంచేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. పేలుడు ఘటన తమను కలిచివేసిందని, ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొంది.
యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ భూపిందర్ కౌర్ ఆనంద్ పేరిట ప్రకటన విడుదల చేశారు. తాము 1997 నుంచి వివిధ విద్యాసంస్థలు నడుపుతున్నామని, హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటర్ అయిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు పొందామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 2019 నుంచి తాము ఎంబీబీఎస్ కోర్సులు నిర్వహిస్తున్నామని, తమ దగ్గర వైద్య పట్టా అందుకున్న చాలామంది ప్రస్తుతం ప్రముఖ ఆస్పత్రుల్లో పని చేస్తున్నారని తెలిపారు.
పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి కలుగాలని తాము కోరుకుంటున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పేలుడు కేసులో మా యూనివర్సిటీలో పనిచేసే ఇద్దరు డాక్టర్లను దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసిందని, వాళ్లు తమవద్ద కేవలం అధ్యాపకులుగా పనిచేస్తున్నారని, అంతకుమించి వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు.
ఢిల్లీ పేలుడు ఘటన వెనుక అల్ ఫలా యూనివర్సిటీ హస్తం ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆ ప్రకటనలో ఖండించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తమ యూనివర్సిటీ పేరు చెడగొట్టేలా తప్పుడు కథనాలను ప్రచురించవద్దని కోరారు. తమ యూనివర్సిటీలో పేలుడు స్వభావంగల రసాయనాలుగానీ, ఇతర సామాగ్రిగానీ లేదని పేర్కొన్నారు. తమ గురించి మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు.