Supriya Sule | కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాట్లలో ఇబ్బందులు సహజమేనని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత సుప్రియా సూలే చెప్పారు. మహారాష్ట్రలో ఇండియా కూటమి పక్షాలు కాంగ్రెస్, శివసేన ఉద్ధవ్ బాల్ ఠాక్రే పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రియా సూలే స్పందిస్తూ.. కాంగ్రెస్, శివసేన ఉద్ధవ్ బాల్ ఠాక్రే పార్టీల మధ్య ప్రతిష్ఠంభనకు పరిష్కారం లభించిందని సోమవారం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, శివసేన ఉద్ధవ్ఠాక్రే పార్టీ నేత ఉద్ధవ్ ఠాక్రే మధ్య ఇటీవల జరిగిన భేటీలో పలు ప్రశ్నలకు జవాబులు దొరికాయన్నారు. వారం, పది రోజుల్లో మూడు పార్టీల మధ్య సీట్ల పంపిణీపై అధికారిక ప్రకటన వస్తుందని సుప్రియా సూలే చెప్పారు.
మహారాష్ట్రలో 48 లోక్సభ స్థానాలు ఉండగా, తమకు 23 స్థానాలు ఇవ్వాలని శివసేన ఉద్ధవ్ ఠాక్రే కోరుతున్నది. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలైన వంచిత్ బహుజన్ అఘాడీ (వీబీఏ) అధ్యక్షుడు ప్రకాశ్ అంబేద్కర్.. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. తమ పార్టీతోపాటు కాంగ్రెస్, శివసేన ఉద్ధవ్ బాల్ ఠాక్రే పార్టీలకు 12 స్థానాల చొప్పున కేటాయించాలన్నారు. దీనిపై సుప్రియా సూలే మాట్లాడుతూ తమ కూటమిలో ప్రకాశ్ అంబేద్కర్ సముచిత చోటు ఉంటుందన్నారు.
మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యమే లేదని శివసేన ఉద్ధవ్ బాల్ ఠాక్రే పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే మళ్లీ సున్నా నుంచి మొదలు కావాల్సి ఉంటుందన్నారు. దీనిపై సున్నితంగా స్పందించిన కాంగ్రెస్ పార్టీ.. కూటమి పక్షాల మధ్య సీట్ల కేటాయింపుపై పూర్తి స్థాయిలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. బీజేపీని ఓడించడానికి అందరూ ఐక్యంగా పోరాడాలని కాంగ్రెస్ సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ పేర్కొన్నారు.