పాట్నా: బీహార్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్డీయే కూటమి ప్రభుత్వం నుంచి తప్పుకున్న జేడీయూ అధినేత నితీశ్ కుమార్, ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి మద్దతుతో మరోసారి సీఎంగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో ఈ నెల 24న అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని నిర్ణయించారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే అయిన విజయ్ కుమార్ సిన్హా, స్పీకర్ పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించారు. దీంతో సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం ఆయనపై అవిశ్వాస తీర్మానం ఇచ్చింది. 50 మంది ఎమ్మెల్యేలు ఈ మేరకు సంతకాలు చేసి అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు.
కాగా, నిబంధనల ప్రకారం స్పీకర్పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై 14 రోజుల తర్వాత చర్యలు చేపట్టాలి. అసెంబ్లీ సమావేశాల తొలి రోజున దీనిపై చర్చించి ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో సీఎం నితీశ్ కుమార్ సర్కార్ బలపరీక్ష కాస్త ఆలస్యం కానున్నది. సాధారణంగా ప్రభుత్వం మారగానే తన పదవికి స్పీకర్ రాజీనామా చేయాలని, అయితే బీజేపీ ఎమ్మెల్యే అయిన విజయ్ కుమార్ సిన్హా ఆ పదవి నుంచి తప్పుకోలేదని జేడీయూ నేత తెలిపారు. దీంతో ఆయనపై అవిశ్వాస తీర్మానం ఇచ్చినట్లు వెల్లడించారు.