(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ‘గుజరాత్లో ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాన్ని (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) కేవలం 8 ఏండ్లలో నిర్మించిన గుజరాత్ ప్రభుత్వానికి.. వసతుల లేమితో 60 ఏండ్లుగా కునారిల్లుతున్న పాఠశాలలు, అంగన్వాడీలను బాగుచేసే సోయి లేకుండా పోయింది’.. గుజరాత్లోని ఆరు గ్రామాల ప్రజలు ఆగ్రహంతో చేసిన వ్యాఖ్యలివి.
అందని ద్రాక్షగా విద్య, వైద్యం
సర్దార్ సరోవర్ డ్యామ్ కోసం తాము ఇచ్చిన భూముల్లో బీజేపీ ప్రభుత్వం గొప్పల కోసం విగ్రహాన్ని నిర్మించిందని కేవడియా, వాఘాదియా, నవగామ్, లింబ్డీ, గొరా, కొతీ తదితర గ్రామాలకు చెందిన ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పునరావాసం పేరిట తమను సిరా, కసుందర్ తదితర ప్రాంతాలకు తరలించిన ప్రభుత్వం.. కనీస వసతులను కల్పించలేదని వాపోయారు. అంగన్వాడీలు, పాఠశాలలు, వైద్యశాలల నిర్మాణం అతీగతి లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. స్కూళ్లలో మరుగుదొడ్లు లేకపోవడంతో పిల్లలు దగ్గరలోని అటవీ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తున్నదని, కాలనీల్లో తాగునీరు, విద్యుత్తు సరఫరాలో ఎప్పుడూ సమస్యేనని మండిపడ్డారు. యువతకు ఉద్యోగ కల్పన ఎండమావిగా మారిందని నిప్పులు చెరిగారు. విగ్రహం ఆవిష్కరించిన అనంతరం స్థానిక యువతకే ఉపాధి అవకాశాలు ఇస్తామన్న ప్రభుత్వం.. అనంతరం బయటివారిని తీసుకొచ్చి పనులు అప్పగించిందని వాపోయారు. తమ పిల్లలు క్లీనింగ్, ఆటోలను తోలడం వంటి పనులను చేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐక్యతా విగ్రహం పరిసరాల్లో వ్యాపారులు పెద్ద దుకాణాలు పెట్టుకున్నా పట్టించుకోకుండా, తాము చిన్న దుకాణాలు పెట్టుకొంటే తీసేయాలంటూ బెదిరింపులకు దిగుతారని మండిపడ్డారు. గుజరాత్ గిరిజనుల అవస్థలను ఇంగ్లిష్ న్యూస్ వెబ్సైట్ ‘ది క్వింట్’ ఓ కథనంలో వెల్లడించింది.
సీఎంను కలిసినా పని కాలే..
కనీస వసతులు కల్పించాలంటూ సామాజిక కార్యకర్తల సాయంతో గ్రామస్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేశారు. ‘డ్యామ్ కోసం భూములు ఇచ్చిన వారి సంతానానికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని బీజేపీ సర్కారు హామీ ఇచ్చింది. అయితే అది ఆచరణలోకి రాలేదు. ఇదే విషయమై సీఎం భూపేంద్రబాయ్ పటేల్ను కలిశాం. 15 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామన్నారు. నెలలు గడిచినా అది జరుగలేదు’ అని జికుబాయ్ అనే ఓ గ్రామస్థుడు మండిపడ్డాడు.
భూములిచ్చిన మాకే నీళ్లు లేవు
నర్మదా ప్రాజెక్టు కోసం మేం భూములిచ్చాం. కానీ, ఆ నీళ్లు ఇప్పటివరకూ మాకు చేరలేదు. పంచాయతీ కార్యాలయంలోని నల్లా దగ్గర తాగునీటిని పట్టుకుంటాం. మూడు రోజులకొకసారి మాత్రమే ఆ నీళ్లు వస్తాయి. ఇంటింటికీ నల్లా కనెక్షన్ అంతా వట్టిదే.
– కన్షాన్బాయ్, కసుందర్ గ్రామస్థుడు
విగ్రహం దగ్గరే గొప్పగా..
విగ్రహం దగ్గరే అంతా గొప్పగా కనిపిస్తుంది. కొంచం లోపలికి వెళ్తే అసలు విషయం బయటపడుతుంది. లింబ్డీ గ్రామంలో అసలు మరుగుదొడ్లే లేవు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి విద్యార్థులు, గ్రామస్థులు అడవిలోకి వెళ్లాల్సిందే. అరడజనుకు పైగా గ్రామాల్లో దాదాపు ఇవే పరిస్థితులు.
– దక్షాబెన్ తడ్వీ, లింబ్డీ గ్రామస్థురాలు