పాట్నా, ఆగస్టు 12: భవిష్యత్తులో ప్రధాని పదవికి పోటీచేస్తారని జరుగుతున్న ప్రచారంపై బీహార్ సీఎం నితీశ్కుమార్ మరోసారి స్పందించారు. తనకు ప్రధాని అవ్వాలనే ఆశ, ఆశయం లేదని.. అయితే కేంద్రంలో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తానని, దీనికి సంబంధించి రాబోవు రోజుల్లో కొన్ని చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు నితీశ్ ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. ‘దయచేసి అటువంటి ప్రశ్నలు అడుగవద్దు. ప్రధాని పదవిపై అశలు లేవని ఇప్పటికే పలుమార్లు చెప్పాను. నా రాష్ర్టానికి సేవ చేసుకోవాలని అనుకుంటున్నాను’ అని చేతులు జోడించి మరీ చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై కేంద్రం సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను పంపే అవకాశం ఉందని, దీనిపై తనకు ఎటువంటి భయాలు లేవని నితీశ్ పేర్కొన్నారు. అయితే ఇలా కేంద్ర సంస్థల దుర్వినియోగానికి అలవాటు పడిన వారు ప్రజలు ఆగ్రహాన్ని తప్పక ఎదుర్కొంటారని అన్నారు.