పనాజీ: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ కలిసి బరిలో దిగనున్నట్లు జరుగుతున్న ప్రచారం ఒట్టిదేనని తేలిపోయింది. గోవా ఎన్నికల్లో తాము ఒంటరిగానే బరిలో దిగుతామని, తృణమూల్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే ఆలోచన లేదని ఆప్ స్పష్టంచేసింది. ఈ మేరకు ఆప్ గోవా డెస్క్ ఇన్చార్జి అతిషి ఒక ప్రకటన చేశారు.
‘నేను పూర్తి బాధ్యత తీసుకుని చెబుతున్నా. తృణమూల్ కాంగ్రెస్తో ఎలాంటి పొత్తుపెట్టుకోం. కాబట్టి వారితో మేం సంప్రతింపులు జరుపుతున్నామనే ప్రచారం అబద్దం. తాము మంచి అభ్యర్థులను బరిలో నిలిపి, అవినీతిలేని నిజాయితీ పరిపాలన ద్వారా గోవాకు స్వచ్ఛమైన ప్రత్యామ్నాయాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాం’ అని అతిషి చెప్పారు. గోవాలో పొత్తు కోసం తృణమూల్ కాంగ్రెస్తో ఆప్ సంప్రతింపులు జరుపుతున్నదని మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె పైవిధంగా స్పందించారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో అక్కడి అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోవాలోని మొత్తం 40 స్థానాలకుగాను కాంగ్రెస్ 17 స్థానాలు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది. దాంతో బీజేపీ ఇతర పార్టీలు, స్వతంత్రులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.