పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది. అయితే ఓటింగ్కు ముందు బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ, జేడీయూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే మహారాష్ట్రలో శివసేన మాదిరిగా జేడీయూను చీల్చేందుకు బీజేపీ కుట్ర పన్నింది. దీంతో అప్రమత్తమైన నితీశ్ కుమార్, పార్టీ సీనియర్ నేతను సస్పెండ్ చేశారు. అనంతరం బీజేపీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి సీఎం పదవికి రాజీనామా చేశారు. అయితే ఆ మరునాడే ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి మద్దతుతో 8వ సారి సీఎంగా ప్రమాణం చేశారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎం అయ్యారు.
ఈ పరిణామాల నేపథ్యంలో బీహార్ అసెంబ్లీ బుధవారం ప్రత్యేకంగా సమావేశమైంది. అయితే స్పీకర్ పదవికి రాజీనామా చేయని బీజేపీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ సిన్హాపై నితీశ్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. దీంతో బుధవారం ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే స్పీకర్ పదవికి ఆయన రాజీనామా చేశారు. అనంతరం జేడీయూకు చెందిన డిప్యూటీ స్పీకర్ మహేశ్వర్ హజారీ సభను నిర్వహించారు.
కాగా, బలపరీక్షకు ముందు ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై సభలో చర్చ జరిగింది. ప్రసంగించిన తేజస్వి యాదవ్, జేడీయూతో తమ భాగస్వామ్యం చారిత్రకమని అన్నారు. ఆ తర్వాత సీఎం నితీశ్ కుమార్ ప్రసంగించారు. బీజేపీ ప్రభుత్వం నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందో అన్నది వెల్లడించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
అనంతరం ముజువాణి పద్ధతిలో ఓటింగ్ జరిగింది. 243 మంది సభ్యుల బీహార్ అసెంబ్లీలో, ఓటింగ్ సమయానికి సభలో ఉన్న ఆర్జేడీ, కాంగ్రెస్, జేడీయూ, ఇతర పార్టీలకు చెందిన 164 మంది ఎమ్మెల్యేల్లో 160 మంది విశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని మమాకూటమి ప్రభుత్వం బలపరీక్షలో విజయం సాధించింది.