పాట్నా, జనవరి 25: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు విచిత్రంగా ఉన్నదని బీహార్ సీఎం నితీశ్ కుమార్ బుధవారం విమర్శించారు. ‘పేద రాష్ర్టాలను ఆదుకోవడానికి కేంద్రం ముందుకు రాదు. పోనీ అప్పు తెచ్చుకొని, వనరులను సమకూర్చుకొని అభివృద్ధి చేసుకుందామని పేద రాష్ర్టాలు ప్రయత్నిస్తే అడ్డుతగులుతున్నది. రకరకాల అంశాలను తెరపైకి తెచ్చి ఆంక్షలు విధిస్తున్నది. దీంతో ఆయా రాష్ర్టాల్లో అభివృద్ధి, సంక్షేమంపై ప్రభావం పడుతున్నది.
ఇదేనా సమాఖ్య వ్యవస్థ అంటే? కేంద్రం వైఖరి చూస్తుంటే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలా వ్యవహరిస్తున్నట్టు అర్థమవుతున్నది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల రుణాలకు ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ర్టాలకు సకాలంలో కేంద్ర నిధులు అందవు. రుణాలు తీసుకుందామంటే అడ్డుతగులుతున్నది. ఎందు కు ఇంత జోక్యం?’ అని ధ్వజమెత్తారు. దేశం అభివృద్ధి చెందాలంటే రాష్ర్టాలు అభివృద్ధి సాధించాలని, అప్పుడే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని చెప్పారు.