న్యూఢిల్లీ : భవిష్యత్ ఇంధనం గ్రీన్ హైడ్రోజన్ అని, దాన్ని ప్రపంచదేశాలకు ఎగుమతి చేయడమే లక్ష్యమని కేంద్ర రోడ్లు, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గురువారం ఆయన ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హర్యానాలో మార్చి 15న టయోటా కారును ఇండియన్ ఆయిల్ ఫరీదాబాద్ ల్యాబ్ గ్రీన్ హైడ్రోజన్ ఇంధనంతో టెస్ట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం తాము గ్రీన్ హైడ్రోజన్ వైపు వెళ్తున్నామని.. తన ఆలోచన మురుగు, టాయిలెట్ వాటర్ నుంచి తయారు చేయడమన్నారు. తక్కువ ఖర్చుతో సౌర, పవన శక్తిని వినియోగించుకోవచ్చన్నారు. ప్రస్తుతం 8లక్షల కోట్ల ముడి చమురు, గ్యాస్, పెట్రోలియం ఉత్పత్తులు దిగుమతి చేస్తున్నామన్న ఆయన.. వాటికి ప్రత్యామ్నాయ ఇంధనాలైన ఇథనాల్, మిథనాల్, బయో డీజిల్, సీఎన్జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్), ఎలక్ట్రిక్, బయో ఎల్ఎన్జీ, గ్రీన్ హైడ్రోజన్తో భర్తీ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ముంబై, పూణే, ఢిల్లీ వంటి నగరాలు ఎలక్ట్రిక్ బస్సులను ఎంపిక చేసుకోవడంతో వాటి సంఖ్య పెరిగిందని అభిప్రాయపడ్డారు. రెండేళ్లలో ఎలక్ట్రిక్ 2, 3, 4 వీలర్ వాహనాలు, బస్సుల ధర సైతం పెట్రోల్, డీజిల్ వాహనాల ధరలతో సమానంగా ఉంటుందని పేర్కొన్నారు.
భారత్ లిథియం-అయాన్ బ్యాటరీలను తయారు చేయడమే కాకుండా.. జింక్-అయాన్, సోడియం-అయాన్, అల్యుమినియం-అయాన్ బ్యాటరీలను సైతం అభివృద్ధి చేస్తుందన్నారు. భారతీయ స్టార్టప్ కంపెనీలు ఈ విషయంలో చాలా పరిశోధనలు చేస్తున్నాయని వివరించారు. ఐదేళ్లలో ప్రపంచంలోనే ఆటోమొబైల్స్ తయారీలో భారత్ నంబర్ వన్గా నిలుస్తుందని చెప్పారు. ఈ రంగంలో టర్నోవర్ రూ.7.5లక్షల కోట్ల నుంచి రూ.15లక్షల కోట్లకు పెరుగుతుందని వివరించారు.