(న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి) బీజేపీలో త్రిమూర్తులుగా వెలుగొందుతున్న నరేంద్ర మోదీ.. అమిత్ షా.. జేపీ నడ్డాకు తృటిలో తిరుగుబాటు తప్పిందా? ఓ బలమైన వర్గం వీరికి ముచ్చెమటలు పట్టించిందా? బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అది లావాలా ఎగిసిపడేదా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. ఆ తిరుగుబాటును తప్పించుకొనేందుకు మహారాష్ట్ర సంక్షోభాన్ని తమ చేతికి అంటకుండా చేసుకొన్నట్టు చెప్తున్నారు. వాస్తవానికి.. మోదీ, షా ద్వయం చేస్తున్న ప్రజాస్వామ ప్రభుత్వాల కూల్చివేతపై బీజేపీలోనే ఓ వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నది. డబుల్ ఇంజిన్ పేరుతో వారు సమాఖ్య స్ఫూర్తిని బుల్డోజ్ చేస్తున్నారన్న వాదన పార్టీలో పెరిగిపోయింది. కర్ణాటక, మధ్యప్రదేశ్, సిక్కిం సహా 8 రాష్ర్టాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూలదోసిందన్న అపకీర్తి మూటగట్టుకొన్నది. ఇది ఇలాగే కొనసాగితే అసలుకే ప్రమాదం వస్తుందని గ్రహించిన పార్టీ సీనియర్లు.. మోదీ, షా దూకుడుకు కళ్లెం వేయాలని, అవసరమైతే హైదరాబాద్లో జరిగే సమావేశాల్లో తేల్చుకొందామని సమాలోచనలు జరిపారు. ఇదే సమయంలో మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూలదోసి ఫడ్నవీస్ను ముఖ్యమంత్రి చేయాలని మోదీ, షా, నడ్డా నిర్ణయించారు.
ప్రభుత్వాలను పడగొట్టుకొంటూపోతే బీజేపీపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని, దీన్ని ఎలాగైనా నిలువరించాలని పార్టీలోని ఓ వర్గం గట్టిగా వాదించింది. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నారాయణ్ రాణే.. సీఎంగా ఫడ్నవీస్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినట్టు తెలిసింది. వీరిద్దరు ఓకే అంటే ఫడ్నవీస్ అవలీలగా సీఎం అయ్యేవారు. మహారాష్ట్ర బీజేపీ 106 సీట్లలో 65 ఎమ్మెల్యేలు వీరి పక్షమే. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఫడ్నవీస్ను సీఎం చేస్తే తాను రాజీనామా చేస్తానని రాణే హెచ్చరించినట్టు సమాచారం. దీంతో అంతర్గత సంక్షోభాన్ని నివారించేందుకు మోదీ, షా ద్వయం.. శివసేనకు చెందిన ఏక్నాథ్ షిండేను ముందుకు తీసుకొచ్చారని, ఆయన సీఎం కావటానికి తిరుగుబాటు అడుగులు దోహదం చేశాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తంగా మరాఠా గడ్డ మీద మోదీ అమిత్షా ద్వయంపై తొలి తిరుగుబాటు జరిగిందని.. తర్వాత మిగతా ప్రాంతాలకూ అది విస్తరించే అవకాశాలు లేకపోలేదని ఆసక్తికర చర్చ జరుగుతున్నది.
తానే ముఖ్యమంత్రి అవుతానని ముందే సన్నిహితులతో చెప్పుకొన్న ఫడ్నవీస్.. చివర్లో పదవి చేజారడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఫడ్నవీస్ అంసతృప్తితో ఉన్నారని ప్రచారం జరగడం, దీంతో పార్టీకి మరింత నష్టం జరుగుతుందని భావించిన కేంద్ర పెద్దలు ఆయనను బుజ్జగించే పనిలో పడ్డారు.
కొసమెరుపు ఏంటంటే.. అసెంబ్లీలో మాట్లాడిన ఫడ్నవీస్.. ‘తిరిగి అధికారంలోకి వస్తానని గతంలో నేను అన్నప్పుడు అందరూ నవ్వారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాను. నాతో పాటు ఏక్నాథ్షిండేను తీసుకొని వచ్చాను. అని అన్నారు. ఫడ్నవీస్ పక్కనే కూర్చొన్న షిండే.. ఫడ్నవీస్ చేతిని తట్టి తాను లేచి నిలబడి అందరికీ అభివాదం చేస్తానని అనుమతి కోరారు. దానికి ఫడ్నవీస్ అంగీకరించటంతో షిండే అభివాదం చేశారు. అసెంబ్లీలో షిండేకు మెజారిటీ నిరూపణ అయినప్పుడు జరిగినప్పటి సంఘటన. దీనికి ట్విట్టర్లో డమ్మీ సీఎం ఏక్నాథ్ అంటూ ట్రోలింగ్ జరిగింది. సోమవారం విలేకరుల సమావేశంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తున్న సీఎం షిండే ముందున్న మైక్ను లాక్కొని ఫడ్నవీస్ జవాబిచ్చారు. ఈ రో జు మైక్ లాక్కొన్నట్టే రేపు సీఎం కుర్చీ లాక్కొంటారని ట్విట్టర్లో ట్రోలింగ్ జరిగింది. ఈవిషయంపై ఈరోజు సీఎం ముందున్న మైక్ను డి ప్యూటీ సీఎం లాక్కొన్నారు. రేపు ఏం లాక్కొనున్నారో అని మాజీ సీఎం ఉద్ధవ్ వ్యాఖ్యానించారు.