లక్నో : ఇప్పటికే ఇద్దరు భార్యలు ఉండగా మూడో పెండ్లికి సిద్ధమైన భర్త (మతపెద్ద)ను భార్య హత్య చేసింది. ముజఫర్నగర్ సమీపంలోని షికార్పూర్ గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది. మూడో భార్య కోసం మతపెద్ద ఉబలాటపడుతుండటంతో భర్తతో ఇద్దరు భార్యలు నిత్యం గొడవపడుతుండేవారని స్ధానికులు పేర్కొన్నారు. రోజూలాగే గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత మతపెద్ద అహ్మద్ (57) ఇద్దరు భార్యలతో తన మూడో పెండ్లి ముచ్చటపై వాదనకు దిగాడు.
ఇద్దరు భార్యల్లో ఒకరైన హజ్రా ఇదే విషయమై అహ్మద్ను నిలదీసింది. దీంతో ఆయన హజ్రాను తీవ్రంగా కొట్టాడు. ఈ విషయం మనసులో పెట్టుకున్న హజ్రా అహ్మద్ నిద్రిస్తుండగా వంటింట్లో ఉపయోగించే కత్తితో భర్తపై విరుచుకుపడింది. అహ్మద్ మరణించడంతో బంధువుల సాయంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమైంది.
స్ధానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని విచారణ చేపట్టడంతో మూడో పెండ్లి చేసుకుంటానని గొడవ పడుతుండటంతోనే భర్తను హతమార్చానని హజ్రా నేరం అంగీకరించింది. ఇద్దరు భార్యల మధ్యే రోజూ గొడవలు జరుగుతుంటే మూడో భార్యను తీసుకురావాలని ఆయన ప్రయత్నించడంతో పట్టరాని ఆవేశంతో హత్య చేశానని పేర్కొంది.