లక్నో, జూన్ 18: బీజేపీ పాలిత బీహార్లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది! బెగుసరాయ్ జిల్లాలో ఒక మహిళపై ‘నిర్భయ’ తరహా సామూహిక లైంగికదాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో బాధిత మహిళ మర్మాంగంలో ఒక తూటా, గులకరాళ్లు, కర్రను చొప్పించి దారుణంగా హింసించినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. చకియా పోలీస్ స్టేషన్ పరిధిలో జూన్ 11న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన.. ఢిల్లీలోని నిర్భయ ఉదంతం తాలూకు భయానక జ్ఞాపకాలను తిరిగి గుర్తుచేస్తున్నది.
ఘటన అనంతరం దవాఖానలో చేరిన బాధితురాలు నుంచి ఫిర్యాదు అందినా.. పోలీసులు సీరియస్గా తీసుకోలేదని, దవాఖానకు పంపి చేతులు దులుపుకొన్నారని బాధితురాలు వాపోయారు. రెండోసారి దవాఖానకు వెళ్లగా..అంతర్గతంగా తీవ్ర గాయాలైన సంగతి వెలుగుచూసింది. నెల క్రితం తనపై ఐదుగురు వ్యక్తులు దాడికి పాల్పడటమేగాక, లైంగికదాడికి యత్నించారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈ ఘటనను పోలీసులు పెద్దగా పట్టించుకోలేదని ఆమె ఆరోపించింది.
ఈ కేసు రాష్ట్రంలో పెను సంచలనంగా మారటంతో.. ప్రభుత్వం ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. ఫోరెన్సిక్ నివేదికలు ఇంకా రావాల్సి ఉంది. ఘటనపై జిల్లా ఎస్పీ మనీశ్కుమార్ మాట్లాడుతూ, ‘బాధితురాలి ఆరోపణలు నిజమేనని ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటుచేశాం’ అని అన్నారు. జూన్ 11 రాత్రి టాయిలెట్ కోసం ఇంటి నుంచి బయటకు రాగా, ఐదుగురు వ్యక్తులు తనను బలవంతంగా ఒక నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లారని ఆమె తెలిపింది.