న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కట్టడికి అమలు చేస్తున్న నైట్ కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. మార్కెట్లో దుకాణాలకు సరి, బేసి ప్రకారం తెరవాలనే నిబంధన కూడా తీసేసింది. సినిమా థియేటర్లు, రెస్టారెంట్లను 50 శాతం సామర్థ్యంతో నడుపుకొనేలా అనుమతి ఇచ్చింది. ఢిల్లీలో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే బడులు, కాలేజీలు మాత్రం మూసే ఉంటాయి. పెండ్లికి 200 మంది దాకా హాజరు అయ్యేందుకు వెసులుబాటు కల్పించారు. కాగా, తమిళనాడులో స్కూళ్లు, కాలేజీలను ఫిబ్రవరి 1 నుంచి తెరువనున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నైట్ కర్ఫ్యూ ఎత్తేస్తున్నట్టు తెలిపింది. పెండ్లికి 100 మంది, అంతిమ యాత్రలకు 50 మంది దాకా మాత్రమే హాజరు కావాలని నిబంధన విధించింది.
జైశంకర్కు కరోనా
విదేశాంగ మంత్రి జైశంకర్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనను కలిసి వారు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు.