బెంగళూరు: ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్.. దేశంలోనూ వేగంగా విస్తరిస్తున్నది. క్రమం తప్పకుండా రోజురోజుకు ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూను అమల్లోకి తెచ్చారు. తాజాగా కర్ణాటక కూడా అదేబాటలో పయనిస్తున్నది. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో నైట్ కర్ఫ్యూను ( Night curfew ) అమలు చేయాలని నిర్ణయించింది.
ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రజల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రమంతటా నైట్ కర్ఫ్యూను అమల్లోకి తెచ్చామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. అదేవిధంగా అన్ని జిల్లాలు, తాలూకాల్లో కరోనా బారినపడి మరణించిన వారి కుటుంబాలను ఆదుకుంటామని బొమ్మై చెప్పారు. ప్రజలంతా కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని సీఎం బొమ్మై సూచించారు.