న్యూఢిల్లీ : దేశంలో మంకీపాక్స్ విస్తరిస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే రెండు పాజిటివ్ కేసులు రికార్డవగా.. తాజాగా మరో కేసు నమోదైంది. దీంతో దేశంలో కేసుల సంఖ్య ఎనిమిదికి చేరాయి. మంగళవారం భారత్లో రెండు కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో నివసిస్తున్న మరో నైజిరియన్కు వైరస్ పాజిటివ్గా తేలింది. సదరు వ్యక్తికి ఎలాంటి ప్రయాణ చరిత్ర లేదని అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. మంకీపాక్స్పై టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఇప్పటి వరకు దేశంలో ఎనిమిది మంకీపాక్స్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
ఇందులో ఐదుగురికి విదేశీ ప్రయాణ చరిత్ర ఉందని పేర్కొన్నారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మంకీపాక్స్ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు టెస్టింగ్ కిట్లు, వ్యాక్సిన్ల అభివృద్ధికి తీసుకుంటున్న పలు చర్యలను వివరించారు. ఎయిర్పోర్ట్, పోర్ట్ హెల్త్ ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండాలని, అంతర్జాతీయ ప్రయాణికులకు పరీక్షలు చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీని అనుమానిత కేసులను పరీక్షించేందుకు రిఫరల్ లాబొరేటరిగా నియమించినట్లు మంత్రి పేర్కొన్నారు. మరో 15 ICMR-VRDL (వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ లాబొరేటరీ) నెట్వర్క్ లేబొరేటరీలు మంకీపాక్స్ నిర్ధారణ కోసం పరీక్షలు చేపట్టేందుకు ఆప్టిమైజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. సోమవారం ఢిల్లీలో నైజీరియన్కు మంకీపాక్స్ సోకిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సదరు వ్యక్తిని ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీలో తొలి మంకీపాక్స్ పాజిటివ్ వ్యక్తి కొలుకొని డిశ్చార్జి అయ్యాడు. భారత్లో తొలి కేసు జూలై 14న కేరళలో నమోదైన విషయం తెలిసిందే.