న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాను బెదిరిస్తూ ఇటీవల వీడియో విడుదల చేసిన ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్పై (Khalistani terrorist Pannun) జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం కేసు నమోదు చేసింది. పలు సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ నవంబర్ 4న ఒక బెదిరింపు వీడియో విడుదల చేశాడు. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించవద్దని, వారి ప్రాణాలకు ప్రమాదం ఉందని అందులో హెచ్చరించాడు.
కాగా, ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు మారుతుందని, నవంబర్ 19 న ఆ ఎయిర్పోర్ట్ను మూసివేస్తారని కెనడాలో ఉంటున్న ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూన్ పేర్కొన్నాడు. అలాగే నవంబర్ 19న వరల్డ్ క్రికెట్ కప్ ఫైనల్ మ్యాచ్ను పోలుస్తూ వరల్డ్ టెర్రర్ కప్ మాదిరిగా ఆ రోజు ఉంటుందని ఆ వీడియోలో బెదిరించాడు. ఈ నేపథ్యంలో ఆదివారం అన్ని చోట్ల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.