జమ్మూ: గత ఏడాది జమ్మూకశ్మీర్లోని పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి(Pahalgam Attack)లో 26 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసును ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు విచారిస్తున్నది. ఆ ఉగ్రదాడి సమయంలో దొరికిన గోప్రోహీరో 12 బ్లాక్ కెమెరా అంశంలో చైనా సాయాన్ని ఎన్ఐఏ కోర్టు కోరింది. చైనాకు సంబంధించిన న్యాయాధికారులకు ఈ నేపథ్యంలో ఆ కోర్టు ఓ లేఖ రాసింది. గోప్రో హీరో 12 కెమెరా ఎవరు కొన్నారు, ఎవరు వాడారు, దానికి సంబంధించిన టెక్నిక్ రికార్డులు ఇవ్వాలని కోర్టు చైనాను కోరింది.
జమ్మూలోని ఎన్ఐఏ చట్టం ప్రకారం స్పెషల్ జడ్జి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఎన్ఐఏ డీఐజీ సందీప్ చౌదరీ ఈ అంశంలో దరఖాస్తు చేసుకున్నట్లు కోర్టు చెప్పింది. బీఎన్ఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 112 ప్రకారం చైనాలోని సంబంధిత న్యాయాధికారులకు లేఖ రాయాలని కోరినట్లు కోర్టు పేర్కొన్నది. పెహల్గామ్ ఉగ్రదాడి కేసు సమయంలో వివిధ పరికరాలు, ఎలక్ట్రానిక్ డివైస్లను సేకరించినట్లు అప్లికేషన్లో పేర్కొన్నారు. గోప్రో హీరో 12 బ్లాక్ కెమెరాను పెహల్గామ్ నుంచి సేకరించారు. అయితే ఘటన జరగడానికి ముందు జరిగిన మూమెంట్ గురించి తెలుసుకునేందుకు దాని వివరాలు కావాలని ఎన్ఐఏ కోర్టు చైనాను కోరింది.
గోప్రో కెమెరా ఉత్పత్తిదారుడు ఆ కెమెరాను చైనాలోని ఏఈ గ్రూపునకు సరఫరా చేశారని, దాన్ని చైనాలో డాంగౌన్లో 2024 జనవరి 30వ తేదీన యాక్టివేట్ చేసినట్లు తెలిసింది. అయితే ఆ కెమెరాకు చెందిన డౌన్స్ట్రీట్ ట్రాన్జాక్షన్ డిటేల్స్ కానీ, ఎండ్ యూజర్ రికార్డులు కానీ లేవని తయారీదారుడు చెప్పినట్లు దరఖాస్తులో వెల్లడించారు.