న్యూఢిల్లీ, మే 25: ఉగ్రవాదులకు నిధుల అందజేత(టెర్రర్ ఫండింగ్) కేసులో దోషిగా తేలిన జమ్ముకశ్మీర్ వేర్పాటువాద నాయకుడు, నిషేధిత జేకేఎల్ఎఫ్ చైర్మన్ యాసిన్ మాలిక్కు ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో పాటు రూ.10 లక్షల జరిమానా వేస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. మాలిక్పై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. మే 19న జరిగిన విచారణ సందర్భంగా ఎన్ఐఏ కోర్టు మాలిక్ను దోషిగా తేల్చింది. మాలిక్కు మరణశిక్ష విధించాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కోరింది. అయితే కోర్టు జీవితఖైదు ఖరారు చేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో శ్రీనగర్లో పోలీసులు ముందుగానే భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. మాలిక్ నివాసం సమీపంలో డ్రోన్ల ద్వారా నిఘా పెట్టారు. కోర్టు తీర్పునకు ముందు మాలిక్ మద్దతుదారులు శ్రీనగర్లో ఆందోళనలు చేశారు. ఈ సందర్భంగా వారికి, భద్రతా బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. బలగాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో వారిని చెదరగొట్టేందుకు టియర్గ్యాస్ ప్రయోగించారు. ముందు జాగ్రత్తగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. మాలిక్కు జీవితఖైదు విధించడం దురదృష్టకరమని గుప్కార్ కూటమి అభిప్రాయపడింది. శాంతి ప్రక్రియకు ఇది విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నది. మాలిక్ శిక్ష విధించడం హురియత్ కాన్ఫరెన్స్ ఖండించింది.