భోపాల్: విడాకులు పొందిన 18 మంది మగవారికి ఒక ఎన్జీవో సంస్థ గ్రాండ్గా పార్టీ ఇస్తున్నది. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ‘భాయ్ సంక్షేమ సంఘం’ అనే స్వచ్ఛంద సంస్థ 2014లో ఏర్పడింది. విడాకులు కోరుతున్న పురుషులకు అండగా ఉంటున్నది. వేధింపులతో నిత్యం నరకం చూపిస్తున్న భార్యల నుంచి భర్తలు విడాకులు పొందేందుకు న్యాయపోరాటంలో సహాయం చేస్తున్నది. తమ అండతో విడాకులు పొందిన మగవారి కోసం ఘనంగా సంబరాలు కూడా జరుపుతోంది. అయితే కరోనా వల్ల గత మూడేళ్లుగా ఎలాంటి వేడుకలు నిర్వహించలేదు.
కాగా, గత మూడేళ్లలో ‘భాయ్ సంక్షేమ సంఘం’ సహాకారంతో దీర్ఘకాల న్యాయ పోరాటం తర్వాత 18 మంది మగవారు విడాకులు పొందారు. ఈ నేపథ్యంలో ఈ నెల 18న భోపాల్ శివారులోని రిసార్టులో గ్రాండ్గా సెలబ్రేట్ చేసేందుకు ఆ ఎన్జీవో సంస్థ సిద్ధమైంది. గత మూడేళ్లలో తమ అండతో విడాకులు పొందిన 18 మందిని దీనికి ఆహ్వానించింది. ఈ వేడుకలో వారిని సత్కరించనున్నది. ‘వివాహ రద్దు ఫంక్షన్’ పేరుతో ముద్రించిన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు ఈ కార్యక్రమంపై తమకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆ సంస్థ కన్వీనర్ జాకీ అహ్మద్ మీడియాకు తెలిపారు. అయితే విడాకులకు మద్దతు ఇవ్వడం తమ సంస్థ ఉద్దేశం కాదన్నారు. చెడు వివాహం వల్ల తలెత్తే వేధింపులు కొన్నిసార్లు ఆత్మహత్యకు దారి తీస్తాయని చెప్పారు. ఇలాంటి వాటిని నివారించేందుకు బాధిత భర్తలకు తమ సంస్థ ఉచితంగా కౌన్సెలింగ్తోపాటు న్యాయ సహాయం అందజేస్తున్నదని వివరించారు. ఇలాంటి కేసుల్లో బాధితులైన ఇంజనీర్లు, డాక్టర్లు, ఇతర వర్కింగ్ ప్రొఫెషనల్స్ తమ సొసైటీలో సభ్యులుగా ఉన్నారని వెల్లడించారు.