బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇటీవల వరుసగా భవనాలు ఒరిగి కూలిపోయితున్నాయి. తాజాగా వీటి సరసన కొత్తగా నిర్మించిన పోలీస్ క్వార్టర్ బిల్డింగ్ చేరింది. మగధి రోడ్డులోని ఏడంతస్తుల బిల్డింగ్ నిర్మాణం మూడేండ్ల కిందట పూర్తి కాగా, గత ఏడాది పోలీస్ సిబ్బంది కుటుంబాలకు క్వార్టర్స్ను కేటాయించారు. అయితే పెద్ద పగుళ్ల కారణంగా శనివారం బీ బ్లాక్ బిల్డింగ్ 1.5 అడుగుల మేర ఒరిగింది. దీంతో అందులో నివాసం ఉంటున్న 38 కుటుంబాలను అధికారులు ఖాళీ చేయించారు.
మరోవైపు ఒరుగుతున్న బీ బ్లాక్, సీ బ్లాక్ బిల్డింగ్పై పడుతుండటంతో దానికి కూడా ప్రమాదం ముంచుకొస్తున్నది. దీంతో సీ బ్లాక్లోని నివాసితులను కూడా అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. కాగా, నాణ్యతలేని నిర్మాణం వల్లనే కట్టిన మూడేండ్లకే పోలీస్ క్వార్టర్స్ భవనాలు కుంగిపోతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.