దేశంలో సెకండ్వేవ్ బీభత్సానికి కారణమైన డెల్టా వేరియంట్ కరోనా వైరస్ (బీ.1.617.2) కొత్త అవతారమెత్తింది. జన్యుక్రమంలో కొత్తమార్పులను సంతరించుకొని మరింత ప్రమాదకరంగా మారింది. కొత్తగా వెలుగుచూసిన ఈ వేరియంట్ను శాస్త్రవేత్తలు ‘డెల్టా ప్లస్’ లేదా ‘ఏవై.1’గా పిలుస్తున్నారు. ఆల్ఫా, డెల్టా, కప్పా తదితర వేరియంట్లతో పోలిస్తే ‘డెల్టా ప్లస్’ తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు హెచ్చరిస్తున్నారు. న్యూఢిల్లీ, జూన్ 15
ఏమిటీ డెల్టా ప్లస్ వేరియంట్?
మానవ శరీరంలో మనుగడను సాగించేందుకు రోగనిరోధకశక్తికి వ్యతిరేకంగా వైరస్లు ఉత్పరివర్తనాలు చెందుతాయి. అలా.. డెల్టా వేరియంట్లో ‘కే 417ఎన్’ అనే మ్యుటేషన్ జరిగి, వైరస్ స్పైక్ ప్రొటీన్లో మార్పు చోటుచేసుకున్నది. ఈవిధంగా‘డెల్టా ప్లస్’ ఏర్పడింది.
ఏయే దేశాల్లోకి వ్యాపించింది?
గత మార్చిలో ఐరోపాలో తొలిసారిగా గుర్తించిన ‘డెల్టా ప్లస్’ వేరియంట్ ఇప్పటివరకూ కెనడా, జర్మనీ, రష్యా, నేపాల్, స్విట్జర్లాండ్, పోలండ్, పోర్చుగల్, జపాన్, అమెరికా, బ్రిటన్తో పాటు భారత్కు కూడా వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 63 కేసులు నమోదయ్యాయి. బ్రిటన్లో 36, భారత్లో 6 కేసులు నమోదయ్యాయి.
ఎందుకు ఇంత ఆందోళన?
‘కే 417ఎన్’ మ్యుటేషన్ వల్ల ‘డెల్టా ప్లస్’ వేరియంట్ ఏర్పడింది. ఇది తీవ్రమైన ఉత్పరివర్తనమని వైద్యులు చెబుతున్నారు. ‘కే 417ఎన్’ ఉత్పరివర్తనం చెందిన వైరస్ రోగనిరోధక వ్యవస్థకు దొరక్కుండా సులభంగా తప్పించుకోగలదని పేర్కొంటున్నారు. కృత్రిమ యాంటీబాడీలను శరీరంలోకి ప్రవేశపెట్టే ‘మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్’ చికిత్సకు కూడా ‘డెల్టా ప్లస్’ లొంగడం లేదన్నారు.
ప్రస్తుత వ్యాక్సిన్లు పనిచేస్తాయా?
‘డెల్టా ప్లస్’ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఏ మేరకు పనిచేస్తాయో ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని ఢిల్లీలోని సీఎస్ఐఆర్-ఐజీఐబీ డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ పేర్కొన్నారు. రెండు డోసుల టీకా వేసుకున్న వ్యక్తుల రక్తంలోని ప్లాస్మాను తీసుకొని, ‘డెల్టా ప్లస్’కు వ్యతిరేకంగా ప్రతిరక్షకాలు ఏర్పడ్డాయో? లేదో? పరీక్షించాల్సిన అవసరమున్నదన్నారు. అయితే, దేశంలో ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నదని, అందోళనపడాల్సిన అవసరంలేదన్నారు.
ఆందోళన వద్దు: వీకే పాల్
డెల్టా ప్లస్ వేరియంట్ గురించి అంతగా ఆందోళన పడొద్దని నీతిఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ మంగళవారం తెలిపారు. ‘డెల్టా ప్లస్’ను ఇంకా వేరియంట్ ఆఫ్ కన్సర్న్ (ఆందోళన కలిగించే వేరియంట్)గా గుర్తించలేదన్నారు. దేశంలో ఈ తరహా కేసుల గురించి అంతర్జాతీయ సమాచార వ్యవస్థకు వివరాలు అందజేసినట్టు పేర్కొన్నారు.