‘కాలం చెల్లిన వాహనాలను వదిలించుకోండి.. రాయితీతో కొత్త వాహనాలు పొందండి’ ఇది ఆర్టీఏ అధికారుల సూచన. పాత వాహనాల వినియోగాన్ని ఇక ఉపేక్షించేది లేదని కేంద్రం ఇటీవల ప్రకటించిన దరిమిలా ఆర్టీఏ అధికారులు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి కేంద్ర నిబంధనలు అమల్లోకి రానున్న సందర్భంగా అధికారులు వాహనదారులను అలర్ట్ చేస్తున్నారు. గ్రేటర్లో కాలం చెల్లిన వాహనాలు సుమారు 3 లక్షల వరకు ఉన్నట్టు తేల్చారు. వాటిని తుక్కుగా మార్చే విధానంపై చర్చిస్తున్నారు. 20 ఏండ్లు దాటిన వ్యక్తిగత వాహనాలు.. 15 ఏండ్లు దాటిన వాణిజ్య వాహనాల సేవలకు స్వస్తి చెప్పేందుకు సమాయత్తమవుతున్నారు. ఆ పాత వాహనాలను తుక్కు చేస్తే… 5 శాతం రాయితీతో కొత్త వాహనం కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించడంపై వాహనదారులు కొంత ఉపశమనంగా భావిస్తున్నారు. అయితే దీనిపై మార్గదర్శకాలు రావాల్సి ఉంది.
కాలుష్యానికి చెక్..!!
కొత్త వాహనాల కంటే పాత వాహనాలు 10-12 శాతం అధికంగా కాలుష్యాన్ని వెదజల్లుతాయని నిపుణులు తెలిపారు. డీజిల్, పెట్రోల్ వాహనాల స్థానంలో సీఎన్జీ, ఎల్పీజీతో నడిచే హై బ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 20 ఏండ్లు దాటిన వ్యక్తిగత వాహనాలు.. 15 ఏండ్లు దాటిన వాణిజ్య వాహనాలకు రిజిస్ట్రేషన్ పునరుద్ధరించకూడదని ప్రతిపాదించింది. ఫిట్నెస్ టెస్టులో విఫలమై రెన్యువల్కు వీలు కానీ వాహనాలను ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికల్గా ప్రకటిస్తారు. స్క్రాపింగ్ సెంటర్ నిర్ధారించే పాత వాహనం తుక్కు విలువ మేర కొత్త వాహనం ఎక్స్షోరూం ధరలో 5 శాతం మినహాయింపు ఇస్తారు.
గ్రేటర్లోనే అధికం..!!
గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలో 3లక్షల వాహనాలు 20 ఏండ్లు దాటినవి ఉన్నట్లు రవాణా శాఖ రికార్డులు చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కోటి 20లక్షల వాహనాలు ఉంటే అందులో సగ భాగం గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో మొత్తం వాహనాలు 64 లక్షలు ఉంటే, అందులో 3లక్షలకు పైగా వాహనాలు 20, 15 ఏండ్లు నిండినవిగా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వీటిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధానాలకు అనుగుణంగా రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేయకుండా తుక్కుగా చేసే చర్యలు తీసుకోనున్నారు.