న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) చార్జింగ్ కోసం వేర్వేరు ఐఐటీలకు చెందిన పరిశోధకులు కొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీ ద్వారా తయారు చేసిన చార్జర్లు ప్రస్తుతం ఉన్న ఆన్బోర్డ్ చార్జర్ల కంటే తక్కువ ధరకే వస్తాయన్నారు. ఫలితంగా టూ వీలర్, ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ వాహనాలను తయారు చేసే ఓ దిగ్గజ సంస్థ కూడా ఈ టెక్నాలజీపై ఆసక్తి చూపిస్తున్నదని ఐఐటీ బీహెచ్యూ చీఫ్ ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్ రాజీవ్ కుమార్ సింగ్ చెప్పారు. కొత్త టెక్నాలజీతో ల్యాబ్లో చార్జర్ను ఇప్పటికే తయారు చేసినట్టు పేర్కొన్నారు. కమర్షియల్ డిజైన్ను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. భువనేశ్వర్, వారణాసి, గువాహటి ఐఐటీల శాస్త్రవేత్తలు ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఈ చార్జర్ చార్జింగ్ చేస్తున్నప్పుడు చార్జర్లాగా, తర్వాత ఇన్వర్టర్లాగా పనిచేస్తుందని చెప్పారు.