న్యూఢిల్లీ, ఆగస్టు 8: ఉద్యోగుల వేతనాలు, గ్యాస్, కరెంట్, టెలిఫోన్ బిల్లుల చెల్లింపులకు చెక్ బుక్లపై ఆధారపడే వారు ఇకపై అప్రమత్తంగా ఉండాలి. మీరు జారీచేసే చెక్కులు బౌన్స్ అయ్యే అవకాశాలు మరింత ఎక్కువయ్యాయి. దీనికి కారణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా తీసుకొచ్చిన ‘24*7 నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌజ్ (నాచ్)’ విధానమే. ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చిన తాజా నిర్ణయంతో ఆదివారంతో పాటు అన్ని సెలవు రోజుల్లో కూడా ఇకపై చెక్కులను ప్రాసెస్ చేస్తారు. గతంలో ఆదివారం, బ్యాంకు సెలవు రోజుల్లో చెక్కులు ప్రాసెస్ అయ్యేవి కాదు. దీంతో చెక్కులు జారీ చేసిన వ్యక్తులు ఆ వ్యవధిలో ఖాతాలో డబ్బు ఉండేలా జాగ్రత్త పడేవారు. అయితే, తాజా నిర్ణయంతో చెక్కు జారీచేసిన సమయంలో సదరు వ్యక్తి ఖాతాలో డబ్బు ఉండేలా చూసుకోవాలి. లేకపోతే చెక్కు బౌన్సుకు పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది.