న్యూఢిల్లీ, మే 2: డయాబెటిస్ చికిత్సలో మరో కీలక ముందడుగు పడింది. పాంక్రియాస్ పనితీరును మెరుగుపర్చే ఔషధ మూలకాలను ఐఐటీ మండి పరిశోధకులు గుర్తించారు. శరీరంలో గ్లూకోజ్ నియంత్రణకు పాంక్రియాస్ ఇన్సులిన్ను విడుదల చేస్తుంది. దీని పనితీరు దెబ్బతినడం వల్ల ఇన్సులిన్ విడుదల ఆగి డయాబెటిస్ వస్తుంది. తాము తాజాగా కనుగొన్న పీకే2 ఔషధ మూలకాలు పాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ విడుదల అయ్యేలా చేస్తాయని ఐఐటీ మండి అసోసియేట్ ప్రొఫెసర్ ప్రసేన్జిత్ మోండల్ చెప్పారు.
డయాబెటిస్ చికిత్సలో ఇది కీలకం కానున్నదని పేర్కొన్నారు. ‘ప్రస్తుతం ఉన్న ఎక్సీనటైడ్, లైరాగ్లూటైడ్ ఔషధాలను ఇంజక్షన్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. వీటి ధర కూడా ఎక్కువ’ అని తెలిపారు. వీటికి ప్రత్యామ్నాయాలను తయారు చేసే ప్రయత్నంలో భాగంగా పీకే2ను గుర్తించామని చెప్పారు. ఈ ఔషధాన్ని నోటితో తీసుకోవచ్చని తెలిపారు.