బెంగళూరు, మే 27 : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం(మే 28) సాయంత్రం 3 గంటలకు తన పదవికి రాజీనామా చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తన రాజీనామా సమర్పించడానికి గురువారం సాయంత్రం 3 గంటలకు ఆయన రాష్ట్ర గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ అపాయింట్మెంట్ కోరినట్లు వర్గాలు తెలిపాయి. న్యూఢిల్లీలో మంగళవారం కాంగ్రెస్ అధిష్ఠాన వర్గంతో జరిగిన ఉన్నత స్థాయి చర్చల అనంతరం ఊహించిన ఈ చర్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి మార్గం సుగమం చేయనున్నది. కాగా, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సిద్ధరామయ్య తనకు చెప్పారని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే ఆర్వీ దేశ్పాండే కూడా బుధవారం ధృవీకరించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య అధికార పోరు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ మార్పు జరగనున్నది.
కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మే 30న ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి డీకేకు పార్టీ అధిష్ఠానం నుంచి గ్రీన్సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తున్నది. కాగా, దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన ఇప్పటివరకు వెలువడనప్పటికీ సిద్ధరామయ్యను రాజీనామా చేయవలసిందిగా పార్టీ అధిష్ఠానం మంగళవారం నాటి సమావేశంలో ఆదేశించినట్లు వర్గాలు తెలిపాయి. అందుకు ప్రతిగా ఆయనకు రాజ్యసభ స్థానంతోపాటు జాతీయ స్థాయిలో పార్టీలో కీలక పాత్రను ఇవ్వడంతోపాటు ఆయన కుమారుడు యతీంద్రకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించడానికి అధిష్ఠానం సంసిద్ధత తెలిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే సిద్ధరామయ్య, డీకే శివకుమార్తో చర్చల్లో పాల్గొన్న పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాత్రం ముఖ్యమంత్రి మార్పు గురించి చర్చించలేదని, కర్ణాటకలో రానున్న రాజసభ, ఎంఎల్సీ ఎన్నికల గురించి మాత్రమే చర్చించామని చెప్పారు. కాంగ్రెస్ నాయకత్వం ఈ విషయంలో ఎంత గోప్యతను పాటించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ రాష్ట్రంలో జోరుగా సాగుతున్న ఊహాగానాలు మాత్రం అధికార మార్పిడినే సూచిస్తున్నాయి.
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ ఆధిక్యతతో గెలుపొందింది. ఈ విజయం అనంతరం కాంగ్రెస్ నాయకులైన డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్య అధికారాన్ని పంచుకునే ఒప్పందం కుదిరినట్లు వదంతులు వినిపించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఈ ఒప్పందాన్ని ఖరారు చేసినట్లు సమాచారం. ఒప్పందం ప్రకారం ఎన్నికల్లో గెలిచిన పదవీకాలంలో మొదటి రెండున్నర సంవత్సరాలపాటు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉండాలి. అయితే రెండున్నర సంవత్సరాల పదవీకాలం పూర్తికావడానికి ఒక వారం ముందే రాజీనామా చేయడానికి సిద్ధరామయ్య అంగీకరించినట్లు సమాచారం. దీంతో మిగిలిన కాలానికి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి సిద్ధరామయ్య మార్గం సుగమం చేయాల్సి ఉంది. గత ఏడాది నవంబర్ 20న రెండున్నరేండ్ల గడువు ముగియడంతో అధికార పోరు మొదలైనప్పటికీ తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధరామయ్య అంగీకరించలేదని వార్తలు వచ్చాయి.