న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: విమాన ప్రయాణికులకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) శుభవార్త చెప్పింది. ఇకపై విమానం కదలటం ఆలస్యమైతే సీట్లోనే గంటల తరబడి అతుక్కుని పోవాల్సిన పనిలేదట. ఎక్కువ సేపు వేచి చూడాల్సిన అవసరం లేకుండా ఎయిర్పోర్ట్ డిపార్చర్ గేట్ నుంచి ప్రయాణికులు వెళ్లిపోవచ్చని తెలిపింది. ఇందుకోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎయిర్పోర్ట్ రద్దీ, పెరుగుతున్న విమానాల ఆలస్యాల నేపథ్యంలో ఈ మార్గదర్శకాలను జారీ చేసినట్టు బీసీఏఎస్ డైరెక్టర్ జనరల్ జుల్ఫికర్ హసన్ సోమవారం తెలిపారు. ఇవి ఇప్పుడు అమల్లోకి వచ్చాయి. కొత్త గైడ్లైన్స్ అమలు చేయటానికి విమానాశ్రయ నిర్వాహకులు స్క్రీనింగ్తో సహా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరముందని హసన్ చెప్పారు. ప్రయాణికులను దింపే నిర్ణయం సంబంధిత విమానయాన సంస్థలు, భద్రతా ఏజెన్సీలు తీసుకుంటాయి.