న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ఆప్ ప్రభుత్వం మధ్య మరో కొత్త వివాదం మొదలైంది. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు లెఫ్ట్నెంట్ గవర్నర్ క్రెడిట్ తీసుకుంటున్నారని ఢిల్లీ మంత్రి, ఆప్ జాతీయ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎల్జీ తమ ప్రభుత్వం చేస్తున్న పనుల వద్దకు వెళ్లి క్రెడిట్ తీసుకుంటున్నారని ఆరోపించారు.
తాము చేస్తున్న అన్ని అభివృద్ధి పనుల జాబితాను ఎల్జీకి ఇస్తామని, అన్నింటి వద్దకు వెళ్లి క్రెడిట్ తీసుకోవచ్చని ఎద్దేవా చేశారు. త్వరలోనే మొహల్లా ఈ-బస్లు ప్రారంభిస్తామని, అవి పార్క్ చేసిన దగ్గరకు వెళ్లి జెండా ఊపి క్రెడిట్ తీసుకోవచ్చని సలహా ఇచ్చారు. కాగా, ఆదివారం యమునా నది ప్రక్షాళన పనులను ఎల్జీ పరిశీలించడంతో ఈ వివాదం మొదలైంది. ఢిల్లీ బడ్జెట్లో ఎల్జీకి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసే అధికారం లేదని, అలాంటిది క్రెడిట్ మాత్రం తీసుకుంటున్నారని సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు.