న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ప్రధాని మోదీ కాన్వాయ్లో ఉన్న ఈ కారు పేరు మెర్సిడెజ్-మేబ్యాచ్ ఎస్650. రష్యా అధ్యక్షుడు పుతిన్కు స్వాగతం చెప్పడానికి మోదీ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్కు వచ్చినప్పుడు తొలిసారి ఈ వాహనం కనిపించింది. ఈ మోడల్ను మెర్సిడెజ్ సంస్థ 2019లోనే విడుదల చేసింది. ఇది బుల్లెట్ ప్రూఫ్ కారు. బాంబు పేలుళ్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. దీని భద్రతా స్థాయి వీఆర్ 10. ఏ కార్ల తయారీ సంస్థ అయినా సరే.. అవి ఇచ్చే అత్యున్నత భద్రత స్థాయి ఇదే. కారు ధర రూ.12 కోట్లు ఉండొచ్చని అంచనా.
విష వాయువు దాడుల నుంచి రక్షణకు దీనిలోకి ఎప్పుడూ తాజా గాలి వస్తుంది. ఇంధన ట్యాంకుకు ఒక ప్రత్యేకమైన పదార్థంతో పూత పూస్తారు. ట్యాంకుకు ఎప్పుడైనా రంధ్రం పడినా ఈ పదార్థం వల్ల దానికదే పూడిపోతుంది. కాగా, కాన్వాయ్లో ఏ వాహనం ఉండాలనేది ప్రధానికి భద్రత కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) నిర్ణయిస్తుందని అధికారులు చెప్పారు.