Brain Chip | న్యూఢిల్లీ, మార్చి 24: ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్కు చెందిన న్యూరాలింక్ కంపెనీ ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. పక్షవాత రోగి నొలండ్ అర్బాగ్ తన మెదడులోని చిప్ సాయంతో మొదటిసారిగా ట్వీట్ చేశారు. తన ఆలోచనలు, న్యూరాలింక్ సైబర్నెటిక్ ఇంప్లాంట్ సాయంతో తాను ఈ పని చేశానని ఆయన చెప్పారు.
‘నన్ను రోబో అనుకొని ట్విట్టర్(ఎక్స్కు గతంలోని పేరు) నన్ను నిషేధించింది. కానీ ఎక్స్, ఎలాన్ మస్క్ తిరిగి నా ఖాతా పునరుద్ధరించారు’ అని ఆయన ట్వీట్ చేశారు. ‘న్యూరాలింక్ టెలీపతి పరికరాన్ని ఉపయోగించి, కేవలం ఆలోచనల ద్వారా చేసిన మొట్టమొదటి పోస్ట్’ అని అర్బాగ్ ట్వీట్కు మస్క్ స్పందించారు. ఇటీవలే అర్బాగ్ బ్రెయిన్ చిప్ సాయంతో వీడియో గేమ్స్ ఆడారు.