కోల్కతా : నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Subhash Chandra Boseను దేశ తొలి ప్రధానిగా కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత కునాల్ ఘోష్ సోమవారం డిమాండ్ చేశారు. అక్టోబర్, 1943లో ఏర్పడిన స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహించారని చెప్పారు. పాఠ్యాంశాల్లోనూ ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమాలను చేర్చాలని పశ్చిమ బెంగాల్ విద్యాశాఖను ఘోష్ కోరారు. విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నిజమైన నివాళి కాదన్నారు. నేతాజీకి చెందిన అన్ని ఫైళ్లను, జపాన్లోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచిన అస్థికల డీఎన్ఏ విశ్లేషణను బహిరంగపరచడం సహా దేశ తొలి ప్రధానిగా గుర్తించడమే ఆయనకు నిజమైన నివాళి అన్నారు.
నేతాజీ స్థాపించిన ‘ఆజాద్ హింద్ ఫౌజ్’కు తొమ్మిది దేశాలు గుర్తించాయని ఘోష్ తెలిపారు. నేతాజీ యుద్ధం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా బాధ్యత వహించారన్నారు. నేతాజీని తొలి ప్రధానిగా ప్రకటించడం కేంద్రం చేతుల్లోనే ఉందని ఆయన చెప్పారు. రాష్ట్ర విద్యాశాఖ సైతం ముందుకు వచ్చి దేశంలో మొట్టమొదటి స్వతంత్ర ప్రభుత్వ ప్రకటన, బాధ్యతల పంపిణీ, అంతర్జాతీయ గుర్తింపు సంఘటనలను పాఠ్యాంశాల్లో చేర్చాలని అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి ఆదివారం జరగ్గా.. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఆయన హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఇక నుంచి నేతాజీ జయంతిని ‘పరాక్రమ్ దివస్’గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు ఇక నుంచి గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 23 నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది.