న్యూఢిల్లీ: ఇంధనం కొనుగోళ్లు, ధరల నియంత్రణకు సంబంధించిన ఇవాళ రాజ్యసభలో కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి హరిదీప్ పురి మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మార్కెట్ నుంచి ఇంధనం కొనుగోలు చేసేందుకు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కరెన్సీ, ఇన్సూరెన్స్, రవాణా ఛార్జీలను బేరేజీ వేస్తున్నట్లు ఆయన చెప్పారు. డీజిల్ ధరలు తగ్గిస్తారా అని ఎంపీ శక్తి సింగ్ అడిగిన ప్రశ్నకు మంత్రి పురి బదులిస్తూ.. డీజిల్ ధరలను డీరెగ్యులేట్ చేశామన్నారు. సాధారణ ప్రజలకు ఊరటనివ్వాల్సి వచ్చిన సమయంలో అప్పుడు ధరలు తగ్గించినట్లు మంత్రి తెలిపారు. వ్యాక్సిన్ల కోసం ఆయిల్ కంపెనీలు ఎక్కువ డబ్బులు చెల్లించాయా అని ఎంపీ చాయా వర్మ అడిగారు. కరోనా వేళ ఇంధనంపై అదనపు పన్ను వసూల్ చేశారా కాబట్టి ఈ ప్రశ్న వేయాల్సివచ్చిందని ఆమె అన్నారు.
ఏ రాష్ట్రాల ఎన్నికలతోనూ ఇంధన ధరలకు లింకు ఉండదని, ఇండియాలో ప్రతి రోజు ఏదో చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయని, దీంట్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదని మంత్రి తెలిపారు. పెట్రోల్ ధరలు 63 సార్లు, డీజిల్ ధరలు 61 సార్లు పెరిగినట్లు కాంగ్రెస్ ఎం పీ కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. అయితే గత నవంబర్ నుంచి పెట్రోల్ ధరలు పెరగలేదని, ధరలు పెంచకపోవడం సంతోషకరమని, అయితే ధరలను ఇలాగే స్థిరీకరిస్తారా అని ఆయన అడిగారు.
వెనిజులా నుంచి ఇంధనం తీసుకురావడంపై మంత్రి స్పందించారు. ఆ దేశంపై మరో దేశం ఆంక్షలు విధించినట్లు మంత్రి చెప్పారు. అయితే అందుబాటులో ఉన్న ఇతర దేశాల నుంచి ఇంధనం తీసుకునే వీలుందన్నారు. ఓపెక్ దేశాలు ఇంధన ఉత్పత్తిని పెంచాలన్నారు. ఈ దిశగా అంతర్జాతీయ సమాజం చర్చలు చేపడుతోందన్నారు. ఆయిల్ కంపెనీలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఆయిల్ బాండ్లను జారీ చేయడం లేదని మంత్రి పురి స్పష్టం చేశారు. ఇంధన ధరలను స్థిరీకరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.