హైదరాబాద్ : కరోనా కేసుల వ్యాప్తితో డయాగ్నస్టిక్ సెంటర్లలో తక్కువ ఖర్చుతో, సత్వరమే కొవిడ్ టెస్టింగ్ ల్యాబ్ల ఏర్పాటుకు హైదరాబాద్కు చెందిన ఫార్మా ఇనుస్ట్రుమెంట్ సంస్థ ప్రొ కాల్ సర్వీసెస్ రంగంలోకి దిగింది. తెలంగాణ, ఏపీ, కేరళల్లో మార్కెట్ వ్యయంలో మూడోవంతులోనే 30 కొవిడ్-19 ఆర్టీపీసీఆర్ ల్యాబ్ల ఏర్పాటుకు ఇప్పటికే సహకరించింది.
మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో తొలుత డయాగ్నస్టిక్స్ సంస్థలకు తమ కంపెనీ బయోసేఫ్టీ కేబినెట్స్, సపోర్టివ్ పరికరాలను సరఫరా చేయడం ప్రారంభించిందని, ఆపై టెస్టింగ్ ల్యాబ్లకు తీవ్ర కొరత ఏర్పడటంతో వాటిని అభివృద్ధి చేయడంలో నైపుణ్యాలను అందిస్తోందని ప్రొ కాల్ సర్వీసెస్ వ్యవస్ధాపక మేనేజింగ్ డైరెక్టర్ జేఆర్ రోహిత్ గౌడ (29) పేర్కొన్నారు. టెస్టింగ్ ల్యాబ్ల నిర్మాణానికి ఒక్కో ల్యాబ్కు రూ 40-50 లక్షలను కంపెనీలు డిమాండ్ చేస్తున్నారని, తాము ఈ ల్యాబ్ల నిర్మాణం, మౌలిక వసతులు సహా కేవలం రూ 12-15 లక్షలకే సమకూరుస్తామని చెప్పారు.
టెస్టింగ్ ల్యాబ్ల ఏర్పాటుకు సహకరించాలని పలు రాష్ట్రాల నుంచి డయాగ్నస్టిక్ కంపెనీలు తమను సంప్రదిస్తున్నాయని తెలిపారు. పోర్టబుల్ టెస్టింగ్ ల్యాబ్ల ఏర్పాటు కోసం తమ సంస్థ డయాగ్నస్టిక్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుందని చెప్పారు. ఈ దిశగా హైదరాబాద్లో అపోలో, గ్లోబల్ హాస్పిటల్స్ వంటి నిర్ధిష్ట ఆస్పత్రులతో చర్చలు జరిపామని, టాటా సంస్ధతో పాటు ఇతరులతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు.